Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ వాస్తవాన్ని భారత ప్రభుత్వం బాగా అర్థం చేసుకుంది. తన శక్తివంచన లేకుండా అమలు చేస్తోంది. ప్రపంచ దేశాలలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి మన దేశాన్ని అచ్చుగుద్దిన నమూనాగా తయారు చేసింది. సంస్థల పేర్లు మారొచ్చు. కొత్త చట్టాలు చేయొచ్చు. ఉన్న చట్టాలను మార్చొచ్చు. వాటన్నింటి పరమార్ధం కార్పొరేట్ కంపెనీలు అడ్డూ అదుపు లేకుండా దేశ సంపదను దోచుకోవటానికి మార్గం కల్పించడమే. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న పరిణామాలే దీనికి తార్కాణం. ఏ పేరైనా ఏ చట్టమైనా కార్పొరేట్ దోపిడీని కొనసాగించటమే కర్తవ్యం.
బ్యాంకు రుణ వసూళ్ల కోసం 2002వ సంవత్సరంలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు (ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ -ఏఆర్సీ) ఏర్పడ్డాయి. చట్టంలో పొందుపరిచిన దాని ప్రకారం బ్యాంకులకు మొండి బాకీలుగా ఉన్న కంపెనీలను కొని, బ్యాంకుల బాకీలు తగ్గేటట్టుగా చూడటం, నష్టాలలో ఉన్న కంపెనీలను కావలసిన చర్యలు తీసుకొనని మరల లాభాల బాటలోకి తేవటం ఎ.ఆర్.సిల పని. కానీ దీనికి విరుద్ధంగా విపరీతమైన లాభాల సంపాదన కోసం ఎ.ఆర్.సిలు పని చేస్తున్నాయి. ఉదాహరణకి బ్యాంకులకు రూ.100 కోట్లు మొండి బాకీ ఉన్న కంపెనీని తాకట్టుపెట్టిన ఆస్తులతో సహా రూ.50 కోట్లకు కొని, తిరిగి ఎక్కువ ధరకు అమ్మి లాభం చేసుకుంటుంది. కంపెనీ అమ్మగా వచ్చిన రూ.50 కోట్లు బ్యాంకు కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇంకా మిగిలి వున్న రూ.50 కోట్ల బాకీని రద్దు చేసుకుంటుంది. దీనికి మద్దు పేరు 'హెయిర్ కట్' అంటే క్షౌరం! ఆర్థికమంత్రి బ్యాంకులు సమర్ధవంతం కావాలంటే 'హెయిర్కట్'కు సిద్దంగా వుండాలని పదేపదే ప్రకటిస్తుంటారు. బ్యాంకు ఖాతాలలో మొండి బాకీ రద్దవుతుంది. కంపెనీ రూ.50 కోట్ల రద్దు వలన లాభపడుతుంది. రూ.50 కోట్లతో కొన్న కంపెనీ ఆస్తులను మార్కెట్లో 'రియల్ ఎస్టేట్'గా మెషినరీ తదితరలో అమ్మిన సొమ్ము చేసుకుంటుంది. దాని విలువ రూ.100కోట్లు వుండొచ్చు. రూ.150 కోట్లు కావచ్చు. ఈ విధంగా ఎ.ఆర్.సికి లాభాల పంట పడుతుంది. మరి నష్టపోయేదెవరు? బాకీలు రద్దు చేసుకున్న మేరకు బ్యాంకులు నష్టపోతాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఐదేండ్ల కాలంలో మొండి బకాయిలు రద్దు రూపంలో రూ. 5లక్షల 60వేల కోట్లు దేశ సంపద కార్పొరేట్ కంపెనీలకు బదిలీ అయ్యింది. బ్యాంకుల రుణ వసూళ్ళకు ఉపయోగపడాల్సిన చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు చుట్టాలుగా మారాయి. బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.లక్షల కోట్ల రుణాలు రద్దయ్యాయి.
కష్టాలలో ఉన్న బ్యాంకులను కాపాడటానికి రూ. లక్షల కోట్లు కేటాయించినట్టు అప్పుడప్పుడు ప్రభుత్వం చేసే ఆడంబర ప్రకటనలు చూస్తూనే ఉంటాం. సామాన్య ప్రజానీకం కట్టే పన్నుల రూపంలో ఉన్న దేశ ఆర్థిక సంపదను దీనికోసం ప్రభుత్వం కేటాయిస్తోంది. ఆ కేటాయింపులను బ్యాంకులు రాని బాకీలు రద్దుకు ఉపయోగిస్తున్నాయి. అంటే దేశ ఆర్థిక సంపదను కార్పొరేట్లు దోపిడీ చేస్తున్నాయి. దీనివలన పేదల సంక్షేమం కోసం కేటాయించాల్సిన ప్రభుత్వ ఆదాయం కార్పొరేట్ కంపెనీలకు బదిలీ అవుతుంది. అందుకే రోజురోజుకి పేదలు మరింత పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారు. అత్యంత వేగంగా ప్రపంచ కుబేరుల జాబితాలో చేరుతున్నారు. కార్పొరేట్ కంపెనీల సంఘం అయిన అసోచామ్ (Aరరశీషష్ట్రaఎ) అంచనా ప్రకారం ఎ.ఆర్.సి లకు అమ్మిన ఆస్తుల వలన బ్యాంకులకు రావాల్సిన బాకీలలో 30శాతం మాత్రమే వసూలువుతుంది. దేశంలో ఉన్న సుమారు 27 ఏఆర్సీలు రూ.3లక్షల 23 వేల కోట్ల మొండిబాకీలు కొన్నాయి. అసోచామ్ ప్రకారం సుమారు రూ.లక్ష కోట్ల రుణాలు దీని ద్వారా బ్యాంకులకు వసూలయితే రూ.2లక్షల కోట్లు బ్యాంకులు నష్టపోయాయి. అంటే దేశం నష్టపోయింది. ఏఆర్సీలు లాభాలు సంపాదించాయి.
బ్యాంకు రుణాలు తీసుకున్న ప్రతి పైసా కార్పొరేట్ల నుండి వసూలు చేయటానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కార్పొరేట్లతో కుమ్మక్కవుతుంది. దాని పర్యవసానమే రూ.లక్షల కోట్ల రుణమాఫీలు కార్పొరేట్లకు, ఎన్నికల బాండ్ల రూపంలో అధికార పార్టీకి నిధులు. ఎవరి బాకీలు రద్దు చేశారో పేర్లు బ్యాంకులు గాని ప్రభుత్వం గాని బయట పెట్టరు. ఎన్నికల నిధుల్చిన పేర్లను బహిర్గతం చేయరు. ఇదీ కార్పొరేట్ల, అధికార పక్షం, బ్యూరోక్రాట్ల అసైతిక బంధం. ప్రజాధనం దిగమింగటానికి ఎఆర్సిలు కూడా ఒక మార్గం. ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజాతంత్ర వ్యవస్థను కాపాడుకోగలం.
- పివిఆర్