Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బయోటెక్నాలజీ విభాగంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిథ్యం 10శాతం కూడా లేదని కీలక సమాచారం బహిర్గతమైంది. సైంటిస్టులు, టెక్నికల్ గ్రేడ్ సిబ్బంది...మొదలైన ఉన్నతస్థాయి పోస్టులు నాన్ రిజర్వేషన్ కేటగిరిలో భర్తీచేయటంతో, మొత్తం సిబ్బందిలో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గం ప్రాతినిథ్యం గణనీయంగా పడిపోయినట్టు తేలింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) ఆధీనంలో దేశవ్యాప్తంగా 16 పెద్ద పెద్ద సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే ప్రతీఏటా నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులెంత మంది ఉన్నారని దాఖలైన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం సమాచారం విడుదల చేసింది. దీంట్లో...ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గం ఉద్యోగుల సంఖ్య 10శాతం లోపే ఉందని తెలిపారు.
'డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ'(డీబీటీ) ద్వారా నిధులు పొందుతున్న ఏ సంస్థల్లోనైనా ఖాళీలను ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతం రిజర్వ్చేయాలి. కానీ అనేక పోస్టుల్ని 'నాన్ రిజర్వ్డ్' కేటగిరిలో భర్తీ చేస్తున్నారన్న సంగతి బహిర్గతమైంది. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ(ఎన్ఐఐ)లో 208లో పర్మినెంట్ ఉద్యోగులుంటే, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు కేవలం 34మంది ఉన్నారు. సైంటిస్టుల్లో ఇద్దరు ఎస్సీ కాగా, గ్రూప్-ఏ సైంటిస్టు పోస్టులన్నీ 'నాన్ రిజర్వ్డ్' కేటగిరీలో భర్తీ చేశారు.
ప్రాతినిథ్యం లేదన్న సంగతి కేంద్రానికి తెలుసు
ఇక 'రిజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ'(డీబీటీకి చెందిన సంస్థ)లో 44 పర్మినెంట్ ఉద్యోగులు పనిచేస్తుండగా, ఇందులో ఎస్సీకి చెందినవారు నలుగురుమాత్రమే ఉన్నారు. సైంటిస్టు కేటగిరిలో ఎస్సీ, ఎస్టీలెవరూ లేరు. పూణెలోని 'నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్'లో సైంటిస్టులుగా ఎస్సీకి చెందినవారు ఐదుగురు, ఎస్టీకి చెందినవారు ఇద్దరు ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు అందుకునే సంస్థలు దేశంలో 16 ఉన్నాయనీ, సమాచారహక్కు దరఖాస్తులోని ప్రశ్నలకు 9సంస్థలు మాత్రమే స్పందించాయనీ ఆర్టీఐ దరఖాస్తుదారు అశోక్కుమార్ మీడియాకు వెల్లడించారు. డీబీటీలో ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిథ్యం లేదన్న విషయంపై సంబంధిత శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ స్పందించారు. డీబీటీలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిథ్యం తగ్గిందన్న సంగతి తమ దృష్టికి వచ్చిందనీ, దీనిని పరిష్కరించే దిశగా తాము సమాయత్తమవుతున్నామనీ ఆమె చెప్పారు. ఈ ఏడాది మేలో జరిగిన నియామకంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.