Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల కార్యకర్తలకు బెయిలు మరింత ఆలస్యం
- కుట్రలో భాగమే : న్యాయవాదులు
ముంబయి : బీమా-కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుని జైళ్లలో మగ్గుతున్న తొమ్మిది మంది హక్కుల కార్యకర్తలకు ఇప్పట్లో బెయిలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ కేసులో పోలీసుల విచారణ ఏడాదిగా సా...గుతూనే ఉన్నది. దీంతో బెయిలు కోసం చూస్తున్న హక్కుల కార్యకర్తలకు నిరాశే ఎదురవుతున్నది. బీమా-కోరేగావ్ అల్లర్లు, ప్రధానిని హత్య చేసేందుకు కుట్రపన్నారనే కేసుతో పాటు పట్టణాల్లో, విద్యా సంస్థల్లో విద్యార్థులకు వామపక్ష తీవ్రవాదం గురించి చెబుతున్నారనే ఆరోపణలతో వీరిపై 'అర్భన్ నక్సల్స్'గా ముద్రవేస్తూ గతేడాదిలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో నిందితులకు ప్రమేయం ఉన్నదని నిరూపించేందుకు సరైన సాక్ష్యాధారాలు తమ ఎదుట ప్రవేశపెట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులలో ఉన్న సమాచారం ఆధారంగా సాక్ష్యాలు ప్రవేశపెట్టాలని సూచించింది.
కాగా, 230 కాపీలను విచారణ చేయాల్సి ఉండగా.. గడిచిన రెండు నెలల్లో పోలీసులు కేవలం నాలుగింటిని మాత్రమే విచారించారు. దీన్ని బట్టి చూస్తే అవన్నీ విచారించాలంటే చాలా సమయం పడుతుందనీ, పోలీసులు కావాలనే ఈ కేసును తాత్సారం చేస్తున్నారని నిందితుల తరఫున వాదిస్తున్న డిఫెన్స్ న్యాయవాది నిహాల్సింగ్ రాథోడ్ ఆరోపిస్తున్నారు. పోలీసులు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తూ నిందితుల హక్కులను హరించివేస్తున్నారని ఆక్షేపించారు. హక్కుల కార్యకర్తలు బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు, ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని ఆయన తెలిపారు. కాగా, ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారి శివాజీ పవార్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని చెప్పారు. విచారణ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందని అడగ్గా.. అది కూడా కోర్టు మీదే ఆధారపడి ఉన్నదనీ, ఈ విషయంలో ఇంతకంటే ఏం చెప్పలేమని ఆమె చెప్పడం గమనార్హం.