Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరెస్సెస్ ఒత్తిడితో డీయూ సిలబస్లో మార్పులు
- ముజఫర్నగర్ అల్లర్ల అంశాలూ ఎత్తివేత
- కులం, ఎల్జీబీటీ విషయాలకు కత్తెర
న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాఠశాల మొదలు డిగ్రీ వరకు పాఠ్యప్రణాళికల్లో ఆరెస్సెస్ అనుకూలాంశాలను జొప్పిస్తున్నది. అంతేకాదు, మతోన్మాద ఘటనలు, ఆరెస్సెస్కు సంబంధించిన ప్రతికూల విషయాలను తొలగిస్తున్నది. ఎన్సీఆర్టీఈ సహా వర్సిటీ సిలబస్లలోనూ ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా దేశరాజధానిలోని ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ సిలబస్లోని గుజరాత్ అల్లర్లు(2002), ముజఫర్నగర్ అల్లర్ల(2013)కు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించేందుకు ఇంగ్లీష్ విభాగం నిర్ణయించింది. వీటితోపాటు కులం, ఎల్జీబీటీలకు సంబంధించిన పేపర్లలోనూ మార్పులు చేయనుంది. ఆరెస్సెస్ అనుబంధ సంఘం నేషనల్ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(ఎన్డీటీఎఫ్) ఈ పాఠ్యాంశాలపై అభ్యంతరం తెలిపిన తర్వాతే వీటి తొలగింపునకు సంబంధించి వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీటీఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో యూనివర్సిటీ అకాడమిక్ ఆ పాఠ్యాంశాలను పరిశీలించి తుదినిర్ణయం తీసుకోవాలని యూనివర్సిటీ అకాడమిక్ కౌన్సిల్ పాఠ్యప్రణాళికను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కు తిరిగి పంపింది. పాఠ్యప్రణాళికను వెనక్కి పంపిన మరుసటి రోజే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16న పైన పేర్కొన్న పాఠ్యాంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయనీ, ఆరెస్సెస్కు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ సంస్థ అనుబంధ సంఘం ఏబీవీపీ.. వర్సిటీ వైస్ చాన్స్లర్ లాడ్జ్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లతో సంబంధమున్న 'మణిబెన్ అలియాస్ బీబీజాన్' అనే పాఠంపై అభ్యంతరం తెలిపింది. ఆ పాఠంలో భజరంగ్ దళ్, ఆరెస్సెస్లను 'తప్పుగా' చిత్రించారనీ, ఆ సంస్థల కార్యకర్తలను హంతకులుగా వివరించారని ఎన్డీఎఫ్టీ సభ్యుడు ఒకరు వివరించారు.
చదువుపైనా రాజకీయం.. అందుకే
సిలబస్ రూపొందించడం, దానిపై తుదినిర్ణయం తీసుకునే అధికారం డిపార్ట్మెంట్కు ఉన్నప్పుడు ఈ మార్పులెందుకని ప్రశ్నించగా.. విద్యావిషయిక అంశాలను కూడా రాజకీయం చేస్తున్నారని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ రాజ్కుమార్ వివరించారు. అకాడమిక్ విషయాల్లో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని భావించడం లేదనీ, అందుకే మణిబెన్ అలియాస్ బీబీజాన్ స్టోరీని తొలగిస్తున్నామని తెలిపారు. ముజఫర్నగర్ అల్లర్లపైనున్న పాఠాన్నీ తొలగిస్తున్నామనీ, మరికొన్నింటిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఎన్డీటీఎఫ్, అకాడమిక్ కౌన్సిల్ సభ్యుడు రసాల్ సింగ్.. కులం, ఎల్జీబీటీలకు సంబంధించిన పాఠాలపై అభ్యంతరాన్ని తెలిపారు. ఎల్జీబీటీలకు సంబంధించిన పాఠం.. హిందూ దేవుళ్లు హౌమోసెక్సువల్గా చెబుతున్నదని, అలాగే, భాగవత పురాణం, స్కంద పురాణాలను ఉటంకిస్తూ పలు అంశాలను పేర్కొన్నదని చెప్పారు. చరిత్ర శాఖ హెడ్ సునీల్ కుమార్ స్పందిస్తూ.. ఎన్డీఎఫ్టీ సూచించిన మార్పులను తాము పరిగణనలోకి తీసుకునే అవకాశముందని తెలిపారు.
ఇటీవలే మహారాష్ట్రలో నాగ్పూర్లోని తుకదోజి మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీ సిలబస్లో 'జాతి నిర్మాణంలో ఆరెస్సెస్ పాత్ర' అంటూ, దాని చరిత్రపైన పాఠాలను చొప్పించిన విషయం తెలిసిందే. ఆరెస్సెస్ హెడ్క్వార్టర్స్ ఉన్న నాగ్పూర్లోని ఈ వర్సిటీలో బీఏ(చరిత్ర) ద్వితీయ సంవత్సరం సిలబస్లో ఈ పాఠాన్ని చేర్చారు. మరో ముఖ్యాంశం ఏంటంటే.. మతోన్మాదం పెరిగిన తీరును వివరించే పాఠాన్ని తొలగించి ఆరెస్సెస్ చరిత్రను ప్రవేశపెట్టారు.