Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాధృచ్ఛికమా, భ్రూణ హత్యలా..?
ఉత్తరకాశీ : కేంద్రం ''బేటీ బచావో బేటీ పడావో'' అంటూ ప్రచారం చేస్తున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇందుకు నిదర్శనం ఉత్తర కాశీ జిల్లాలోని 132 గ్రామాల్లో మూడు నెలల కాలంలో ఒక్క ఆడశిశువు కూడా జన్మించలేదని ఉత్తరాఖండ్ అధికారుల నివేదిక బహిర్గతం చేస్తోంది. నివేదిక ప్రకారం... ఉత్తరకాశీ జిల్లాలోని ఆ గ్రామాల్లో గత మూడు నెలల్లో 216 మంది శిశువులు జన్మించారు. అయితే వీరిలో ఒక్క ఆడ శిశువు కూడా లేదని అధికారులు పేర్కొన్నారు. ఆడశిశువుల సంఖ్య 'జీరో'గా ఉన్నా, 'సింగిల్ డిజిట్' గా ఒకే అంకెలో ఉన్న ప్రాంతాలను తాము గుర్తించామని, దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర సర్వే, అధ్యయనం చేపడతామని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆశా వర్కర్లతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఈ ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగించాలని, ఈ అంశంపై సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు. ఈ సమావేశానికి గంగోత్రి ఎమ్మెల్యే గోపాల్ రావత్ కూడా హాజరయ్యారు. మూడు నెలల కాలంలో ఒక్క ఆడశిశువు కూడా జన్మించకపోవడానికి భ్రూణ హత్యలు పెరగడమే కారణమనేది స్పష్టంగా సూచిస్తుందని సామాజిక కార్యకర్త కల్పన ఠాకూర్ పేర్కొన్నారు. ఇది యాదృచ్ఛికం కాదని, జిల్లాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని తెలుస్తోందన్నారు. ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. లింగనిర్థారణ పరీక్షలు జరగకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని సీనియర్ జర్నలిస్ట్ శివ్సింగ్ తన్వాల్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాల్లో నమోదైన లింగనిష్పత్తిలో తేడాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని అన్నారు.