Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏకు బాంబేహైకోర్టు ప్రశ్న
ముంబయి : మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణ ఎప్పటి వరకు పూర్తవుతుందో తెలపాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండువారాల్లోగా తగిన సమాచారంతో పాటు షెడ్యూలునూ అందించాలని ఎన్ఐఏ అడ్వకేట్ సందేశ్ పాటిల్ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 475 మంది సాక్షులకు గానూ 124 మందిని ప్రశ్నించామని కోర్టుకు పాటిల్ తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన సమీర్ కులకర్ణి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు రంజిత్ మోరే, భారతీ దంగ్రే లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
ఇదే కేసులో వేరే అంశానికి సంబంధించి మరొక నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు ఐ.ఎ మహంతి, ఎ.ఎం బాదర్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. చార్జీషీటు నుంచి తొలగించబడిన సాక్షుల పేర్లకు సంబంధించి జాబితాను సమర్పించడానికి మరికొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని ఎన్ఐఏ కోరింది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు 2కు వాయిదా వేసింది. 2008 సెప్టెంబరు 29న మహారాష్ట్రలోని మాలేగావ్లో ఓ మసీదు వద్ద పేలుడు సంభవించడంతో ఆరుగురు చనిపోగా, 100 మంది గాయాలపాలయ్యారు. ఈ కేసులో బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్తో పాటు మరో ఆరుగురు నిందితులుగా ఉన్నారు.