Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రయాన్-2 మొదటి దశ ప్రయోగం సక్సెస్
- ఇస్రో ఖాతాలో మరో ఘనకీర్తి
- సెప్టెంబర్ 7న చంద్రునిపై దిగనున్న ఉపగ్రహం
సిక్స్... ఫైవ్... ఫోర్... త్రీ... టు... ఒన్... సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నాసర్ కంట్రోల్ సెంటర్ లో కౌంట్డౌన్ పూర్తయింది. 20 గంటల కౌంట్డౌన్ అనంతరం సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు జాబిల్లి దిశగా జీఎస్ఎల్వీ మార్క్-3 వాహక నౌక ప్రయాణం రెండవ ల్యాంచ్ ప్యాడ్ నుంచి ప్రారంభమైంది. 3.8 టన్నుల బరువైన చంద్రయాన్-2 మిషన్ను మోసుకుంటూ జీఎస్ఎల్వీ దూసుకుపోయింది.
నెల్లూరు : జీఎస్ఎల్వీ-మార్క్3ఎం1 వాహకనౌక (రాకెట్) 16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణం అనంతరం చంద్రయాన్ మాడ్యుల్ను భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో చంద్రయాన్-2 మాడ్యూల్ను నిర్ణీత కక్ష్యలోకి జీఎస్ఎల్వీ ప్రవేశపెట్టింది. చంద్రునిపై భారత కీర్తి పతా కాన్ని ఎగురవేసేందుకు వేసిన తొలి అడుగు విజయవంతమైంది. షార్లోసంబరాలు అంబరాన్నంటాయి.
ఎన్నో ఏండ్ల కలను సాకారం చేస్తూ చందమామ వైపుగా ఇస్రో ప్రయాణం ప్రారంభమైంది. చందమామ రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్ఎల్వీ మార్క్-3 (జియోసింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ద్వారా సోమవారం అనుకున్న సమయానికి నిర్ధిష్ట కక్ష్యలో చంద్రయాన్-2 మిషన్ను ఉంచింది. ఈ నెల 15న ప్రయోగ సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని 24 గంటల్లో సవరించి, సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధం చేయడంతో తొలి అడుగు విజయవంతంగా పడింది. షార్ ప్రయోగవేదికలో నెలకొన్న ఉత్కంఠత నేపధ్యంలో నింగికెగిసిన జీఎస్ఎల్వీ ప్రయాణం సజావుగా సాగింది. తొలుత ఎస్200 ఇంజిన్ మండుకుంది. 110 సెకన్లకు ఎల్110 స్టేజీ మండింది. తర్వాత 131 సెకన్లకు ఎస్200 ఇంజిన్లు విడిపోయాయి. 203 సెకన్లకు పేలుడు ఫైర్ అయి విడిపోయింది. మళ్లీ ఎల్110 స్టేజీ 305 సెకన్లకు విడిపోయింది. 311 సెకన్లకు సి.25 కీలకమైన క్రయోజనిక్ స్టేజి మండుకొంది. 959 సెకన్లకు సి.25 క్రయోజనిక్ స్టేజీ సపరేట్ అయింది. 181 కిలోమీటర్ల వద్ద 974 సెకన్లకు చంద్రయాన్-2 మిషన్ కక్ష్యలోకి చేరింది. భూమికి దగ్గరగా 180 కిలోమీటర్లు, దూరంగా 45 వేల కిలోమీటర్లలో చంద్రయాన్-2ని జీఎస్ఎల్వీ ఉంచింది. కచ్చితంగా ముందుగా అనుకున్న సమయానికే నిర్ధిష్ట కక్ష్యలో చంద్రయాన్ మిషన్ను జీఎస్ఎల్వీ వాహకనౌక ప్రవేశపెట్టింది. చంద్రమామపై కాలుమోపాలనే 11 ఏండ్ల కల సాకారం దిశలో తొలి అడుగుపడింది. దీంతో, ఒక్కసారిగా షార్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ ప్రయోగాన్ని ఇస్రో చైర్మెన్ శివన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇస్రో మాజీ చైర్మెన్లు కె.రాధాకృష్ణన్, కిరణ్కుమార్లతోపాటు కన్హికృష్ణన్, సాయినాథన్ తదితరులు పాల్గొన్నారు.
ఆ చారిత్రాత్మక ఘట్టం కోసం
చందమామపై ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా కాలుమోపాయి. ప్రపంచంలో నాలుగో దేశంగా చంద్రయాన్కు ఇస్రో శ్రీకారం చుట్టింది. భారత కీర్తి పతాకాన్ని చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఎగురవేయాలని సంకల్పించింది. 3.86 లక్షల కిలోమీటర్ల దూరంలోని చంద్రుని చేరుకునేందుకు సుదీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ చంద్రయాన్ మిషన్ను తొలిదశగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇక అక్కడ 45 నుంచి 48 రోజుల ప్రయాణం ఉంటుందని అంచనా! సెప్టెంబర్ మొదటి వారంతంలో ఏడు లేదా 8వ తేదినాటికి చంద్రునిపై దిగే అవకాశం ఉంది. ఆ చారిత్రాత్మక ఘట్టం కోసం ఇప్పుడు దేశం ఎదురుచూస్తోంది.
మూడు పరికరాలు
చంద్రయాన్-2లో మూడు కీలకమైన పరికరాలను ఇస్రో అమర్చింది. వాటిలో ఒకటి ఆర్బిటర్, రెండోది లాండర్ (విక్రమ్), మూడోది రోవర్ (ప్రజ్ఞా) ఉన్నాయి. ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అటు తర్వాత లాండర్ చంద్రునిపై సున్నితంగా దిగుతుంది. లాండర్లో ఉంచిన రోవర్ మెల్లగా చంద్రునిపై దిగి 500 మీటర్ల వరకూ ప్రయాణం చేస్తుంది. ఈ సమయంలోనే నీరు, ఖనిజాలు, ఇతర పరిస్థితులను అధ్యయనం చేస్తూ భూమికి సమాచారాన్ని అందిస్తుంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే క్షణం కోసం ఇస్రో వేయి కండ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకూ ఏ దేశమూ చూడని చంద్రుని దక్షిణ ధ్రువవైపు ఏముందో కనుక్కునే పనిలో ఇస్రో ఉంది. ఇది విజయవంతమైతే చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా, చంద్రుని దక్షిణ ధ్రువవైపు దిగిన మొదటి దేశంగా భారతదేశం నిలుస్తుంది.
కీలకం ఆ 15 నిమిషాలే...
చంద్రయాన్ తుది అంకంలో 15 నిమిషాలు అత్యంత కీలకంగా మారనున్నాయి.ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోతుంది. ఆ తరువాత రోవర్ బయటకు వచ్చి చంద్రునిపై ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అంతెత్తునుంచే ఆర్బిటర్ ల్యాండర్ను చంద్రుని మీదకు విడుస్తుంది. అంతకుముందే చంద్రునిపై వాతావరణ పరిస్థితిని కొంతమేరకు ఆటోమేటిక్ వ్యవస్థ దావరా ఆర్బిటర్ అధ్యయనం చేస్తుంది. సజావుగా ల్యాండ్ అవడానికి అవకాశం ఉన్న చోటును గుర్తించి అక్కడికి ల్యాండర్ను పంపుతుంది. ఆ తరువాత ల్యాండర్ నుండి (విక్రమ్) రోవర్ ( ప్రజ్ఞా) బయటకు వస్తుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడివడటమూ, రోవర్ బయటకు రావడం అంతా 15 నుండి 20నిమిషాల్లో ముగుస్తుందని అంచనా! ఇది సక్రమంగా జరిగితేనే చంద్రయాన్ ప్రయోగంలోనొ ఘట్టం ప్రారంభమవుతుంది. అదే, చంద్రుని ఉపరితలంపై న్న పదార్ధాలను సేకరించడం, వాటిని విశ్లేసించి భూమిపైకి పంపే ప్రక్రియ. దీనికోసం ప్రజ్ఞా సెనకును సెంటిమీటర్ వేగంతో 14 రోజుల పాటు చంద్రునిపై ప్రయాణం చేయనుంది.
ఇది ఆరంభమే : ఇస్రో చైర్మెన్ డాక్టర్ కె.శివన్
ఇస్రో భవిష్యత్తు చరిత్రకు ఇది ఆరంభం మాత్రమేనని ఇస్రో చైర్మెన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా చంద్రయాన్-2 నిర్ధిష్ట కక్ష్యలో చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. మాస్టర్ కంట్రోల్ రూంలో ఇస్రో శాస్త్రవేత్తలను, సిబ్బందిని అభినందించి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ చంద్రయాన్-2 ప్రయోగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని చెప్పారు. ఇంజినీర్లు, టెక్నిషియన్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, విఎస్ఎస్, ఎల్టిఎస్ఎస్, ఐటీ, ఆర్సీ శాఖలతోపాటు అన్ని విభాగాల వారూ చంద్రయాన్-2 ప్రయోగం కోసం విరామం లేకుండా ఒకటిన్నర సంవత్సరం నుంచి పనిచేశారన్నారు.. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు వారం రోజుల నుంచి వందలాది మంది అహర్నిశలూ కృషి చేసి దేశ ప్రతిష్టను నిలబెట్టారని ప్రశంసించారు. ప్రయోగం విజయవంతమవడంతో తమ శ్రమను మరచిపోలేమన్నారు. రానున్న రోజుల్లో జీఎల్ఎల్వీ మార్క్-3ని మరింత ఆధునికీకరించి కొత్త టెక్నాలజీతో రూపొందిస్తామని చెప్పారు.