Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్లో వలస కార్మికుల అవస్థలు
- శ్రీనగర్లోని టూరిస్టు రిసెప్షన్ సెంటర్లో ప్రయాణికుల పడిగాపులు
శ్రీనగర్: 'ఉగ్రదాడుల'కు సంబంధించి ఇంటెలిజెన్స్ నుంచి నిర్దిష్టసమాచారం వచ్చిందంటూ అమర్నాథ్ యాత్రికులు, టూరిస్టులను కాశ్మీర్ వ్యాలీ నుంచి వెనక్కి రావాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఈ ఆదేశాలు పర్యాటకులు, యాత్రికులకు ప్రత్యేకంగా ఇచ్చినవిగా కాశ్మీర్లో నివసిస్తున్న వలస కార్మికులు భావించారు. కానీ, 370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్లోయ అంతటా విధించిన నిరవధిక కర్ఫ్యూ... వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావితం చూపుతున్నది. దీంతో చాలామంది ఆ రాష్ట్రాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు.
కాశ్మీర్ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రతీ 500 మీటర్లకూ ఒక చెక్ పోస్టుతోపాటు సాయుధ వాహనాల గస్తీ తిరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో వలస కార్మికులు శ్రీనగర్లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ (టీఆర్సీ)కు చేరుకుంటున్నారు. అందులో చాలా మంది పిల్లాపాపలతో వివిధ జిల్లాల నుంచి అక్కడకు వస్తున్నారు. తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు బస్సుల కోసం పడిగాపులుకాస్తున్నారు.
జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు... వెళ్లే అన్ని వాణిజ్య, ప్రయివేటు టాక్సీలను పోలీసులు ఉధంపూర్ వద్ద ఆపివేస్తున్నారు. స్థానికులను తప్ప మరెవరినీ లోయలోకి ప్రయాణించడానికి అనుమతించటంలేదు. అలాగే శ్రీనగర్ నుంచి జమ్మూ వరకూ వెళ్ళే టాక్సీలను అర్థరాత్రి మాత్రమే బయలుదేరడానికి అనుమతిస్తున్నారు.
గత 19 ఏండ్లుగా కాశ్మీర్లో నివసిస్తున్న బీహార్లోని మాన్సీకి చెందిన గులాం సర్వార్ (40) తన భార్య, ఆరుగురు కుమార్తెలు, అత్తతో కలిసి సౌరా నుంచి శ్రీనగర్ టీఆర్సీకి చేరుకునేందుకు దాదాపు తొమ్మిది కిలోమీటర్లు నడిచా రు. కూలి పనిచేసుకునే అతని సోదరుడు మొహమ్మద్ షాబుద్దీన్ (38) కూడా తన భార్య, నలుగురు కుమారులతో వచ్చారు. 'కొంతమంది పోలీసులు మా ఇంటికి వచ్చారు. పరిస్థితి మరింత దిగజారుతున్నందున సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిపొమ్మన్నారు. కూలి పనిచేసుకుని నెలకు రూ.18,000 సంపాదిస్తున్నాను. నేను బీహార్లో సంపాదించిన దానికంటే ఇది చాలా ఎక్కువే. ఇప్పుడు అన్ని దుకాణాలు మూతపడ్డాయి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అందుకే మేం సొంత రాష్ట్రానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం' అని సర్వార్ చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు నడిచాక.. వారు టీఆర్సీకి చేరుకున్నారు.
టీఆర్సీ యార్డులో ప్రభుత్వ బస్సులు ఎక్కువ లేవు. జమ్మూవరకూ టాక్సీలే నడుస్తున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రభుత్వం సరైన రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటుచేయలేదని సర్వర్ వాపోయారు. సర్వర్ కూతురు యాస్మిన్ (23)కు కాశ్మీరీ అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలో వివాహం జరగాల్సి వుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వివాహాన్ని కూడా రద్దుచేసుకుని మరీ వారు కాశ్మీర్ విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక ఎప్పుడూ కాశ్మీర్కు రాకూడదని ఆ కుటుంబం నిర్ణయించుకున్నారు.
కర్ఫ్యూ కారణంగా, టీఆర్సీ వద్ద ఆహారం కూడా సరిగా దొరకటంలేదు. అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం తాత్కాలిక ఆహార దుకాణాలను కొందరు ఏర్పాటుచేశారు. ప్రయాణికులు రోడ్లపైనే నిద్రపోతున్నారు. గంటగంటకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. బస్సు టిక్కెట్ల కోసం గంటలుగంటలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి.
సొంతూళ్లకు 5 నుంచి 90 వేల మంది వలసకార్మికులు
అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఆగస్టు 5 నుంచి దాదాపు 90,000 మంది వలస కార్మికులను సురక్షితంగా జమ్మూకు తరలించారు. 'ప్రతి ప్రయాణికుడినీ సురక్షితంగా తరలించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.. కానీ, ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతుండటంతో రోజుల కొద్దీ ఇక్కడ వారు వేచివుండే పరిస్థితి నెలకొని ఉన్నది' అని టీఆర్సీ అధికారి ఒకరు చెప్పారు.