Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ విస్తీర్ణం తగ్గి ప్రజలకు స్వచ్ఛమైన గాలి కరువు
- బడా పెట్టుబడిదారుల కోసం అడవుల నరికివేత
- అభివృద్ధి, పరిశ్రమలు కోసమంటూ సమర్థించుకుంటున్న పాలకులు
- వాతావరణంలో పెరుగుతున్న కార్బన్డయాక్సైడ్ శాతం
అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు...బడా పెట్టుబడిదారుల పరమవుతున్నాయి. గత ఐదేండ్లలో ఇది మరింత వేగవంతమైందని తాజాగా ఒక అధ్యయనం తేల్చింది. అభివృద్ధి చేస్తున్నాం, పరిశ్రమలు వస్తున్నాయని చెబుతూ పాలకులు చేస్తున్న ఈ దోపిడి, రేపటి పౌరుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని అధ్యయనం హెచ్చరించింది. 640 జిల్లాలో స్వచ్ఛమైన గాలి కరువై సరైన ఎత్తు, బరువులేని శిశుజననాలు పెరిగాయని అధ్యయనం తెలిపింది. ఈ జిల్లాలో ధూలికణాల సంఖ్య(పర్టిక్యులర్ మ్యాటర్)-2.5గా నమోదైనట్టు ఇందులో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత పాలకులదే. గాలి, నీరు, ఆహారం...సమృద్ధిగా అందాలంటే ప్రకృతి బాగుండాలి. ప్రకృతి బాగుండాలంటే...అడవుల నరికివేతను అడ్డుకోవాలి. ప్రజలకు, జీవకోటికి స్వచ్ఛమైన గాలి అందాలంటే అడవులు విస్తారంగా ఉండాలి. అలా చూడాల్సిన బాధ్యత పాలకులది..ప్రభుత్వానిది. అడవుల నరికివేత గణాంకాల్ని పరిశీలిస్తే, మోడీ సర్కార్ తన బాధ్యత మరిచిందని తాజాగా ఒక అధ్యయనం హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. స్వచ్ఛమైన గాలి లేకపోవటం ప్రజలపై, శిశుజననాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవటం కోసం 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ', 'స్టాటిటికల్ ఇనిస్టిట్యూట్ మరియు ఇనిస్టిట్యూట్ ఆఫ్ అట్మాస్పియరిక్ స్టడీస్' సంయుక్తంగా ఒక పరిశోధన జరిపారు. దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో 2,25,000మంది చిన్నారులను కలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులపై పరిశీలన చేయగా, ఆందోళనకరమైన సంగతి బయటపడింది. స్వచ్ఛమైన గాలి కరువై ఎంతోమంది చిన్నారుల్లో శారీరక ఎదుగుదల లోపం తలెత్తిందని పరిశోధకులు తేల్చారు. బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మోడీ సర్కార్ మొదలుపెట్టిన 'చార్దామ్ జాతీయ రహదారి' ప్రాజెక్టు వివాదాస్పదమైంది. పర్యావరణ నిబంధనల్ని, అటవీ చట్టాల్ని తుంగలోతొక్కి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారని విమర్శలు వెల్లువెత్తాయి. పవర్ ప్రాజెక్టుల కోసం, ఖనిజ తవ్వకాల కోసం అడవుల ఆక్రమణ పెరిగిపోయిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
స్వచ్ఛమైన గాలి ఏది?
స్వచ్ఛమైన గాలి మనిషి ఆయుర్దాయాన్ని పెంచుతుందనటంలో ఎలాంటి అనుమానమూ లేదు. దీనిపై 'యూనివర్సిటీ ఆఫ్ చికాగో' వారి పరిశోధన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. అదేంటంటే, ఒకదేశంలో స్వచ్ఛమైన గాలి అక్కడి ప్రజల ఆయుష్షుని 4.3ఏండ్లు పెంచుతుందట! మరి..కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకుంటే? ప్రజల ఆయుష్షునేగాక, అక్కడ పుట్టే పిల్లల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుందనీ, సరైన ఎత్తు..బరువు లేకుండా పిల్లలు పుడతారనీ హెచ్చరిస్తోంది. 'ఎయిర్ క్వాలిటీ-లైఫ్ ఇండెక్స్' అనేదానిని సైతం చికాగో వర్సిటీవారు రూపొందించారు. దీని ప్రకారం 2017లో ఇండియాలో శిశుమరణాలు పెద్ద ఎత్తున నమోదయ్యాయి.
అత్యంత కాలుష్య నగరాల్లో టాప్
ప్రపంచంలో అత్యంత కాలుష్యమయమైన 20 నగరాల్లో 15 నగరాలు మనదేశంలోనే ఉన్నాయి. దీన్నిబట్టి ఇండియాలో గాలి ఎంత స్వచ్ఛంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో మోడీ సర్కార్ నిర్లక్ష్య ధోరణి విమర్శలపాలవుతోంది. మోడీ సర్కార్ 'బిజినెస్ ఫ్రెండ్లీ' విధానాలతో ముందుకు వెళ్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు.
- ద వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వారి డాటా, అమెరికా జియోలాజికల్ సర్వే, నాసా శాటిలైట్ చిత్రాలు.. ఇవన్నీ ఇండియాలో అడవుల నరికి వేతకు సంబంధించి కీలక విషయం బయట పెట్టాయి.
- 2014-18 మధ్యకాలంలో కనుమరుగైన అటవీ విస్తీర్ణం 1,22,748 హెక్టార్లు. 2001-18మధ్యకాలంలో ఇండియాలో జరిగిన అడవుల నరికివేత 16లక్షల హెక్టార్లు.
- ఓ వైపు అడవుల నరికితే ఇదే విధంగా కొనసాగితే...వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది.
- ఇప్పుడు పరిశ్రమల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్లో 73శాతం వాతావరణంలోకి వెళ్తోంది.