Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: కృష్ణానదికి వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం ప్రకాశం బ్యారేజీ వద్దకు 8.21 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి క్రమంగా తగ్గుతూ వస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. పులిచింతల నుండి శనివారం 7.66 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మోపిదేవి వెంకట రమణారావు పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు తదితరులు విజయవాడలో రణదివెనగర్, తారకరామానగర్, భూపేష్గుప్తానగర్, గీతానగర్ ప్రాంతాల్లో పర్యటించారు.
బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతు సంఘం నాయకులు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెండు జిల్లాల్లోని 32 మండలాల్లో 87 గ్రామాల్లో ఇంకా ముంపు కొనసాగుతోంది. 2009 అనంత రం మరోసారి పులిగడ్డ ఆక్విడెక్ట్పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి అమెరికా నుండి సిఎంఓ అధికారులతో సమీక్షిం చారు. సహాయ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. బాధితుల కు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మరో వైపు నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. 590 అడుగుల ఎత్తుకు 586 అడుగులకు చేరుకుంది. కృష్ణాజిల్లాలో కొక్కిలిగడ్డ దళితవాడలో సుమారు 290 నివాసాలు పూర్తిగా నీటమునిగాయి. ఆల్మట్టి వద్ద మధ్యాహ్నం రెండుగంటలకు 4.56 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ వద్ద రూ.3.64 లక్షల క్యూసెక్కులు, జూరాల వద్ద 5.58 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర వద్ద 78 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి 7.49 లక్షలు, నాగార్జునసాగర్ నుండి 7.50 లక్షల క్యూసెక్కులు, పులిచింతల నుండి 6.53 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తుండగా ప్రకాశం బ్యారేజీ వద్ద 7.61 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయం కంటే సాయంత్రానికి వరద ప్రభావం కొంచెం తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలోని ఆముదాల్లంక వద్ద ఐదుగురు వరద నీటిలో చిక్కుకుపోగా సహాయక సిబ్బంది వారిని రక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 7363 హెక్టార్లలో పంట దెబ్బతింది. వరుసగా రెండోరోజు నీటి ముంపునకు గురవడంతో ఎనిమిది వేల ఎకరాల్లో అరటి, మినుము, బొప్పాయి, చెరకు, పసుపు, కంద, మల్బరీ, పత్తి, మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతినిపోయాయి.
ముంపునకు గురైన మండలాలు
గుంటూరు జిల్లా పరిధిలోని మాచవరం, గురజాల, దాచేపల్లి, అచ్చంపేట, అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర, రేపల్లె మండ లాల్లో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కృష్ణాజిల్లా లో జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, పెనమలూరు, తోట్లవల్లూరు. పమిడిముక్కల, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ, కోసూరు, నాగాయలంక మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కంచికచర్ల మండలంలో గల్లంతయిన బాలిక మృతదేహాన్ని శనివారం ఉదయం గుర్తించారు.