Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో చూపుకోల్పోయిన 11మంది
- ఆస్పత్రి లైసెన్స్ రద్దు
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కంటి శుక్లాల శస్త్రచికిత్స వికటించి 11 మంది చూపును కోల్పోయారు. 'నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్' (ఎన్పీసీబీ) నిర్వహించిన క్యాంప్లో భాగంగా ఓ ప్రయివేటు కంటి ఆస్పత్రి 14మందికి ఉచితంగా శుక్లాల శస్త్ర చికిత్స చేసింది. చికిత్స పొందిన 11మంది బాధితులు.. ఈ నెల 9న కంటివాపు, దురద, మునుపటి కంటే చూపు మరింత మందగించడం వంటి సమస్యలు వస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని పరీక్షించిన వైద్యులు.. వారికి ఇన్ఫెక్షన్ సోకిందని నిర్ధారించారు. కానీ ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు సోకిందో వెల్లడించలేదు. దీంతో బాధిత కుటుంబాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. చికిత్స చేయించుకున్న వారిని వెంటనే మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నది. ఒక్కో బాధితుడికి రూ.50వేల నష్టపరిహారం అందించనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా రెడ్క్రాస్ సైతం ఒక్కో బాధితుడికి తక్షణ సహాయం కింద రూ.20వేల విడుదల చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేశామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తులసి శిలావత్ తెలిపారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి కమిటీ వేసి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. కాగా, గతంలోనూ ఈ ఆస్పత్రికి ఇలాంటి వివాదాస్పదమైన చరిత్ర ఉంది. 2010లో సర్జరీ చేసిన తర్వాత 18 మంది చూపును కోల్పోయారు. ఫలితంగా ఆస్పత్రిపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో ఐ క్యాంపులు నిర్వహించకుండా 2011లో నిషేధానికి గురైంది. కానీ, తర్వాత నిషేధం ఎత్తేయడంతో మళ్లీ ఐ క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నది.