Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో జైట్లీ చికిత్స పొందుతున్న పక్క బ్లాక్లోనే ..
- రంగంలోకి 34 ఫైర్ ఇంజన్లు
- ఎమర్జెన్సీ విభాగం తాత్కాలికంగా మూసివేత
న్యూఢిల్లీ : దేశరాజధానిలో ప్రతిష్టాత్మక ఆల్ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఆస్పత్రి రెండో అంతస్థులోని ఎమర్జెన్సీ వార్డుకు దగ్గరలో ఉన్న పీసీ బ్లాక్లో అమాంతంగా మంటలు చెలరేగాయి. ఒక్కో అంతస్థు నుంచి మరో అంతస్థుకు భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆస్పత్రిలోని మొదటి అంతస్థు నుంచి నాలుగో అంతస్థు వరకు దట్టమైన పొగలు అలుముకున్నాయి. అసలు
ఎం జరుగుతుందో తెలియక రోగులు, జనం భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపకశకటాలు వచ్చి అతికష్టం మీద మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదం జరిగినపుడు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్నారు. జైట్లీ ఉన్న పక్క బ్లాక్లోనే ఈ ప్రమాదం జరగటం గమనార్హం. అలాగే ఉన్నావో బీజేపీ ఎమ్మెల్యే లైంగిక దాడి ఆరోపిత బాధితురాలు కూడా ప్రాణాపాయ స్థితిలో ఎయిమ్స్లోనే చికిత్స పొందుతున్నది. దీంతో అగ్ని ప్రమాదంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఘటన యాధృచ్చికమా..? లేదా కావాలనే చేశారా? అన్న పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక అధికారులు ప్రాధమిక అంచనాకొచ్చారు.
ఈనెల 9న ఎయిమ్స్లోని కార్డియో న్యూరో సెంటర్ ఐసీయూలో చేరిన జైట్లీ.. అక్కడే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావో బాధితురాలు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నది.కాగా, పీసీ బ్లాక్లో మంటలు ఒక్కసారిగా చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఆస్పత్రిలో ఉన్న పేషెంట్లు, వారి బంధువులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక కేంద్రానికి ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించింది. దీంతో మంటలను ఆర్పడానికి మొదట 10 అగ్నిమాపక శకటాలు వచ్చాయి. ఆ తర్వాత మొత్తంగా 34 అగ్నిమాపక యంత్రాలు,150 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగాక కానీ మంటలు అదుపులోకి రాలేదు. కాగా, అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ముందుజాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ విభాగాన్ని, సూపర్ స్పెషాలిటీ ఓపీడీ వార్డును, ఏబీ1 వార్డును ఎయిమ్స్ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఎమర్జెన్సీ విభాగంలో ఉన్న పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎయిమ్స్లో మంటలు అదుపు చేయడానికి ఫైర్ సర్వీసు ప్రయత్నిస్తున్నదనీ.. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అయితే పీసీ బ్లాక్లో కేవలం వైద్యులే ఉంటారు. అక్కడే పేషేంట్లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పీసీ బ్లాక్లో ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఎయిమ్స్లోని ట్రామా విభాగంలోనూ అగ్నిప్రమాదం సంభవించిన విషయం విదితమే. అయితే ఇప్పటికీ అగ్నిప్రమాదాలను నియంత్రించేలా సరైన చర్యలు తీసుకోలేదని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.