Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనల నేపథ్యంలోనే నిర్ణయమన్న అధికారులు
శ్రీనగర్ : శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఆదివారం తిరిగి అంక్షలు విధించారు. శనివారం ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలోని హజ్ యాత్రకు వెళ్లిన మొదటి విడత యాత్రికులు కాశ్మీర్కు తిరిగివచ్చారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. తిరిగి విధించిన ఆంక్షలు కాశ్మీర్లోయలోని అనేక ప్రాంతాల్లో వరుసగా 14వ రోజు ఆదివారం కూడా కొనసాగాయి. శనివారం శ్రీనగర్, లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను కొద్దిగా సడలించిన నేపథ్యంలో దాదాపు 12 ప్రదేశాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయని, ఈ ఘటనల్లో కొంతమంది గాయపడ్డారని తెలిపారు. 300 మంది యాత్రికులతో కూడిన విమానం ఒకటి ఉదయం శ్రీనగర్ ఎయిర్పోర్టుకు చేరుకుందని, సొంత ప్రాంతాలకు వారు వెళ్లేలా తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఎయిర్పోర్టులో యాత్రికులను రిసీవ్ చేసుకునేందుకు కుటుంబ సభ్యులనే అనుమతించామని, వారిని అక్కడి నుంచి జిల్లాలకు తరలించేందుకు ప్రభుత్వమే బస్సులను ఏర్పాటు చేసిందని చెప్పారు. కాశ్మీర్లోయలోని 35 పోలీసుస్టేషన్ల పరిధిలో శనివారం ఆంక్షలను సడలించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ అన్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక యువతకు, భద్రతా బలగాలకు ఘర్షణ ఏర్పడిందని, ఇది ఆంక్షల విధింపునకు తిరిగి దారితీసిందని పేర్కొన్నారు.
నిర్బంధంలో నాలుగు వేల మంది
ఈ నెల 5న జమ్ముకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సుమారు నాలుగు వేల మందిని అరెస్టు చేసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎఎఫ్పీ అనే న్యూస్ ఏజెన్సీతో ఒక జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీరిందరినీ ప్రజారక్షణ చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధించినట్టు తెలిపారు. ఈ వివాదాస్పద చట్టం ద్వారా ఎటువంటి విచారణ లేకుండా ఎవరినైనా రెండు సంవత్సరాల పాటు నిర్భంధంలో ఉంచే అవకాశం అధికారులకు ఉంటుంది. స్థానికంగా జైళ్లలో ఖాళీ లేకపోవడంతో అరెస్టైన వారందరినీ కాశ్మీరేతర ప్రాంతాలకు తరలించారన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తనకు కేటాయించిన శాటిలైట్ ఫోన్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. నిర్బంధంలో ఉన్న వారి సంఖ్య గురించి ప్రభుత్వం ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. వంద మందికి పైగా రాజకీయనేతలు, సామాజిక కార్యకర్తలనే హౌస్ అరెస్టు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఒత్తిళ్లతోనే 'కాశ్మీర్ నిర్బంధం'
వీడియో విడుదలకు అనుమతి నిరాకరణ
'కాశ్మీర్ నిర్బంధం'పై తయారు చేసిన నివేదికను విడుదల చేసేందుకు, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ)లో ఈనెల 14న వీడియోను ప్రదర్శించేందుకు అనుమతిని కొన్ని ఒత్తిళ్ల మేరకు నిరాకరించారన్న తమ ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని రచయితలు కవితా కృష్ణన్, జీన్ డ్రెజ్, మైమూనా అబ్బాస్ మొల్లా, విమల్ భారు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ గొడవ పీసీఐతో కాదని, కేంద్ర ప్రభుతమే ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నివేదికల పై ఆసక్తి కనపరుస్తున్న ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కాశ్మీరీయులకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. వీరితో పాటు దేశ వ్యాప్తంగా పలురకాలుగా హింస, బెదిరింపులకు గురవుతున్న వారికి సంఘీభావం తెలపాలన్నారు.