Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. పాఠశాలల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలో ఇప్పటివరకి సుమారు 2,214 ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేశామని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వివరించింది. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలపై సామాజిక కార్యకర్త జేకే రాజ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జులై 26 న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయ నియామకాల భర్తీ, మౌలిక వసతులపై ఇరు రాష్ట్రాల సీఎస్లు సుప్రీం కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. గతంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను సర్కారు పాఠశాలల్లోని ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,214 ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టిందనీ, మరో 4 ,444 పోస్టుల భర్తీకి హైకోర్టులో పిటిషన్ ఉండడంతో ఆలస్యమవుతున్నదని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది.
నియామకాలకు హైకోర్టుతో ఇబ్బంది ఉన్నదనీ, కానీ మౌలిక వసతులు కల్పించటానికి ఇబ్బందులేంటనీ వాదన మధ్యలో ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాదనలు విన్న సుప్రీంకోర్టు, ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆరు నెలల్లోపు రాష్టంలోని పాఠశాలలో నియామకాలు, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించింది. తెలంగాణ అఫిడవిట్ ను వచ్చే వారం విచారిస్తామని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.