Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైగా మృతురాలి కుమారుడి అరెస్టు
చైన్నై: దేశంలో రోజురోజుకు దళితులపై అగ్రవర్ణాల దాడులు తీవ్రమవుతున్నాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో అమానుషమైన ఘటన జరిగింది. తమ నివాసాల ముందు నుంచి దళితురాలి అంతిమ యాత్ర చేయరాదని పెత్తందారులు దాడికి దిగారు. పోలీసులు ఈ దాడిని ప్రేక్షకుల్లా చూశారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఈ ఘటన లో నిందితులుగా మృతురాలి కుమారుడిని, ఇతర బంధువులను అరెస్టు చేయడం గమనార్హం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంభకోణం తాలుకాలోని సిరిగుడి గ్రామంలో నివాసిస్తున్న అన్నా లక్షి అనే దళితురాలు (65) ఈ నెల 13న మరణించింది. మరుసటి రోజు ఉదయం ఆమె అంతిమ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ నివాసాల ముందు నుంచి అంతిమ యాత్ర వెళ్లకూడదంటూ పెత్తందారులు అడ్డుకున్నారు. దీనిని దళితులు తిరస్కరించారు. దీంతో కోపోద్రిక్తులైన పెత్తందారులు అంతిమయాత్రపౖౖె రాళ్లతో దాడి చేశారు. పోలీసులు ఈ దాడిని చూస్తున్నా.. కేవలం ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప.. దాడిని నియం త్రించే ప్రయత్నం చేయలేదని బాధితులు వాపోయారు. ఈ దాడిలో నలుగురు మహిళలతో సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. శవాన్ని తీసుకెళ్లేవారు లేక మహిళలే ఆ శవాన్ని శ్మశానం వరకు మోసుకెళ్లి అంత్యక్రియలను పూర్తి చేశారు.
మృతురాలి కుమారుడి అరెస్టు
తల్లి హఠాణ్మరణంతో బాధపడుతున్న ఇల్లయరాజ తోపాటు మరో ఇద్దరిని ఎలాంటి కారణం చెప్పకుండా వారిని అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీపీఐ (ఎం), తమిళనాడు అంటరానితనం నిర్మూలన ఫ్రంట్ (టీిఎన్యూఈఎఫ్) నేతలు జోక్యం చేసుకోవడంతో వారిని విడుదల చేయించారు. అనంతరం సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.