Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దబోల్కర్ హత్యకేసులో మందకొడి విచారణే
- స్వేచ్ఛగా బయట తిరుగుతున్న కుట్రదారులు
- కాల్చిన తుపాకీ కోసం వెతుకుతున్న విచారణ సంస్థలు
- హేతువాదికి న్యాయం జరిగేదెన్నటికీ..?
ముంబయి : మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన హేతువాది, సామాజిక కార్యకర్త నరేంద్ర దభోల్కర్ హత్యకు గురై ఆరేండ్లు గడుస్తున్నా ఈ కేసులో విచారణ ఇంకా మందకొడిగానే సాగుతున్నది. 2013 ఆగస్టు 20న పూణెలోని తన ఇంటి నుంచి ఉదయపు నడకకు వెళ్లిన ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందిన విషయం విదితమే. కాగా, ఈ కేసు విచారణను దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించినప్పటికీ అది అడుగు కూడా ముందుకు పడటం లేదు. విచారణ నెమ్మదిగా సాగుతున్నదనీ, దానిని వేగవంతం చేయాలని దభోల్కర్ కుటుంబసభ్యులు పలుమార్లు కోర్టులను ఆశ్రయించినా కేసులో మాత్రం పురోగతి కనిపించడం లేదని వారు వాపోతున్నారు. దభోల్కర్ హత్యకేసులో అతివాద హిందూ సంస్థ అయిన సనాతన్ సంస్థ (ఎస్ఎస్)కు చెందిన సభ్యులు నిందితులుగా ఉన్నప్పటికీ విచారణ సంస్థల వైఫల్యం కారణంగా వారంతా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి (ఎంఎఎన్ఎస్) అధ్యక్షుడు హమీద్ దభోల్కర్ ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో అమోల్ కాలే, అమిత్ దిగ్వేకర్, రాజేశ్ బెంగెరలను సీబీఐ గతంలో విచారించింది. (వీరందరూ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసులోనూ నిందితులుగా ఉన్నారు) గతేడాది డిసెంబర్లో పూణెలోని స్థానిక కోర్టు ఒకటి వీరికి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత తొంభై రోజులైనా వీరిపై తిరిగి చార్జిషీటు దాఖలు చేయడంలో సీబీఐ మీనమేషాలు లెక్కిస్తున్నది.
2016 జూన్లో ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న ఈఎన్టీ వైద్యుడు, ఎస్ఎస్ క్రియాశీలక సభ్యుడైన వీరేంద్ర తవడెను సీబీఐ అదుపులోకి తీసుకుంది. విచారణ అనంతరం దాఖలు చేసిన చార్జిషీటులో దభోల్కర్ను కాల్చి చంపారనే ఆరోపణతో ఎస్ఎస్ కార్యకర్త సారంగ్ అకోల్కర్, వినరు పవార్, శరద్ కలాస్కర్, పునలేకర్, తదితరులనూ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే వరకు అడపాదడపా విచారణ కొనసాగగా దభోల్కర్ను కాల్చి చంపిన ఇద్దరిలో శరద్ కలాస్కర్ను ఒకడిగా గుర్తిస్తూ సీబీఐ విచారణ చేపట్టగా.. కాల్చిన తుపాకీని థానేకు సమీపంలోని సముద్రంలో పడవేశానని ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు వాంగ్మూలం ఇచ్చాడు.
ఆరు నెలలు గడిచిన తర్వాత కలాస్కర్ వాంగ్మూలం ఆధారంగా సముద్రంలోని సంబంధిత ప్రదేశాన్ని సోదా చేయడానికి సీబీఐ ఇటీవలే పూణె కోర్టులో అనుమతి కోరింది. కాగా, ఈ సోదా జరిపే ప్రక్రియను ఓ విదేశీ సంస్థకు అప్పగించడం గమనార్హం. నేటి (2019 ఆగస్టు 20)తో దభోల్కర్ హత్యకు గురై ఆరేండ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగట్లేదని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.