Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేక్ ఇన్ ఇండియా విఫలం : ఎల్ అండ్ టీ చైర్మెన్ ఏ.ఎం.నాయక్
- బడా కంపెనీలేవీ దేశీయంగా ఉత్పత్తి జరపటం లేదు
- ఇప్పటికీ వాటి ఉత్పత్తులన్నీ విదేశాల నుంచి దిగుమతే..
- ఇండియా ఉద్యోగాల్ని ఎగుమతి చేస్తోంది.. తప్పితే వస్తువుల్ని కాదు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటున్న 'మేక్ ఇన్ ఇండియా'(భారత్లో తయారీ) దారుణంగా విఫలమైందనీ, ఉద్యోగాల్ని సృష్టించలేకపోయిందనీ ప్రముఖ నిర్మాణరంగ సంస్థ 'లార్సన్ అండ్ టోబ్రో'(ఎల్ అండ్ టీ) చైర్మెన్ ఏ.ఎం.నాయక్ అన్నారు. ''ఇప్పుడు ఇండియా విదేశాలకు వస్తువుల్ని ఎగుమతి చేయటం లేదు. ఉద్యోగాల్ని ఎగుమతి(వేరే దేశాల్లో ఉన్నవారికి పని కల్పిస్తున్నాం) చేస్తోంది''అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్'(ఎన్ఎస్డీసీ)కి కూడా నేతృత్వం వహిస్తున్న ఆయన సోమవారం ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్ ఘనంగా ప్రకటించిన 'మేక్ ఇన్ ఇండియా' విఫలమైందని స్పష్టం చేశారు. తయారీ రంగం కుంటుపడి ఆర్థిక సంక్షోభం దిశగా దేశం వెళ్తోందన్న ఆందోళన కార్పొరేట్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
ఈనేపథ్యంలో నాయక్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆటోమొబైల్, ఐటీ, టెక్సిటైల్ సహా ఇతర తయారీరంగాలు సంక్షోభబాటలో పయనిస్తున్నా యన్నది తెలిసిందే. ఇందులో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉపాధి కోల్పోయి ఇప్పుడు రోడ్లమీదకొస్తున్నారు. ఈనేపథ్యంలో ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మరికొన్ని సంగతులు ఇలా ఉన్నాయి...
దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోయింది..
దేశీయంగా ఉత్పత్తి జరపడానికి బడా కార్పొరేట్ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. విదేశాల నుంచి దిగుమతిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. తద్వారా మనం వేరే దేశాలకు ఉద్యోగాల్ని ఎగుమతి చేస్తున్నట్టే లెక్క. కార్పొరేట్ కంపెనీలు ఇలా ఎందుకు చేస్తున్నాయో ఆలోచించాలి. సమస్య ఏదైనా ఉంటే ప్రభుత్వాలు పరిష్కరించాలి. చైనా ఏవిధంగా ఎదుగుతుందో మనం పరిశీలించాలి. ఇండియా, చైనాల జనాభా దాదాపు ఒకటే. చైనాతో పోటీపడాలంటే, ఉద్యోగాల కల్పన జరగాలంటే ప్రతిఏటా 12 లేదా 13శాతం వృద్ధి తప్పనిసరి.
ప్రతిఏటా కోటిమంది యువత చదువు పూర్తిచేసుకొని ఉద్యోగాల కోసం ఆశగా బయటకు వస్తున్నారు. ఇంతమంది జాబ్ మార్కెట్లోకి వస్తున్నా, ఇందులో 95శాతం యువతకు సరైన వృత్తి నైపుణ్యాల ఉండటం లేదని గణాంకాలు చెబుతు న్నాయి. మరోవైపు నిపుణులైన కార్మికల కొరతను తయారీ రంగం పెద్ద ఎత్తున ఎదుర్కొంటోంది. గత ఐదేండ్లుగా పాలకులు ఏం చేశారన్నది ఇక్కడ ఉదయిస్తోన్న ప్రశ్న.
బోల్తా పడ్డామా!
ప్రధానిగా మోడీ అధికారంలోకి రాగానే 'మేక్ ఇన్ ఇండియా'ను (25 సెప్టెంబరు, 2014లో) ఘనంగా ప్రారంభించారు. ప్రతిఏటా 2కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. దేశీయ తయారీరంగం రూపురేఖలు మారిపోతా యని తెగ ప్రచారం జరిగింది. ఐదేండ్లు గడిచిపోయాయి. ఫలితాలు చూస్తే తయారీరంగ పరిస్థితి మరింత దిగజా రిందని తేలింది. ఐటీ, ఆటోమొబైల్, టెక్సిటైల్ రంగాల్లో పరిశ్రమలు క్రమంగా మూతపడే సూచనలు అందుతు న్నాయి. ఈ ఐదేండ్లలో విదేశీ పెట్టుబడులు పెరగలేదు, ఉద్యోగ కల్పన పెరగలేదు, ఇండియా ఎగుమతులు పెరగలేదు. 'మేక్ ఇన్ ఇండియా' ఏమైందో సమాధానం చెప్పడానికి 'మోడీ సర్కార్' నుంచి ఎవరూ అందుబాటులో లేరు. 25 కీలక రంగాల్లో తయారీని పెంచాలన్నది 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యం ఏమైందో తెలియదు.