Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ?
విశాఖపట్నం : విశాఖ మన్యంలోని కొయ్యూరు, జికె.వీధి మండలాల సరిహద్దు లోని అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ పరిధి మండపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు తెలిసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్టు మొదట ప్రచారం జరిగినా, అలాంటి ఏమీలేదనీ, 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం. తప్పించుకున్న వారిలో మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు చలపతి, ఆయన భార్య అరుణ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసులకు లభ్యమయ్యాయి. చలపతి, అరుణ లక్ష్యంగా సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.