Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనింగ్ వ్యతిరేక పోరాటంపై నవీన్ ప్రభుత్వం అణచివేత ధోరణి
- ఏండ్ల క్రితం నాటి కేసులను తిరగదోడుతూ అరెస్టులు
భువనేశ్వర్ : ఒడిషాలోని కల్హండి-రాయగడ జిల్లాల్లో విస్తరించిన నియాంగిరి కొండ శ్రేణి ప్రాంతంలో మైనింగ్కు వ్యతిరేకంగా పోరాడుతన్న అక్కడి గిరిజనులపై ఒడిషా సర్కారు ప్రతీకారపూరితంగా వ్యవహరిస్తున్నది. వారిపై ఉన్న ఏండ్ల క్రితం నాటి కేసులను తిరగదోడుతున్నది. ఎలాంటి నోటీసులను ఇవ్వకుండానే గిరిజన నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేస్తున్నది.బహుళజాతి కంపెనీ వేదాంతకు వత్తాసు పలుకుతూ గిరిపుత్రులను అణగదొక్కుతున్నది. నవీన్ పట్నాయక్ సర్కారు తీరుపై నియాంగిరి గిరిపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటాన్ని ఆపేది లేదని తెగేసి చెప్తున్నారు. ఒడిషా సర్కారు తీరును మానవ హక్కుల సంఘాలు సైతం తప్పుబడుతున్నాయి. నిరాధార కేసులు బనాయించి గిరిజన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించాయి.
కల్హండి జిల్లాలోని పాల్బెరీ, కునకాడు గ్రామస్థులు.. నియాంగిరి సురక్ష సమితి(ఎన్ఎస్ఎస్) కార్యకర్తలైన దాదీ కద్రాక, జిలు మాఝీ, తుంగురు మాఝీ, సల్పు మాఝీ, పత్ర మాఝీ లను ఎలాంటి నోటీసు లేకుండానే పోలీసులు గతనెల 24న అరెస్టు చేశారు. ఇప్పటికీ వీరు జైలులోనే ఉన్నారు. నియాంగిరి కొండ ప్రాంతంలో దిగ్గజ కార్పొరేట్ సంస్థ వేదాంత మైనింగ్కు వ్యతిరేకంగా అక్కడి డోంగ్రియా కోంద్ గిరిజన తెగ పోరాటం సాగిస్తున్న నేపథ్యంలోనే వారి అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. అయినా గిరిపుత్రులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 2006లో లాంజిగఢ్ ప్రాంతంలో అక్కడి స్థానికుల అనుమతి లేకుండానే వేదాంత సంస్థ అల్యూమినియం రిఫైనరీని స్థాపించింది.
సదరు సంస్థ తమ వద్ద నుంచి దాదాపు పదెకరాల భూమిని బలవంతంగా లాక్కున్నదనీ.. ఇందుకు సంబంధించి తప్పనిసరైన క్లియరెన్సులనూ కంపెనీ పొందలేదని అక్కడి ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ ప్రయోజనాలను గాలికొదిలేశాయనీ.. అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తూ వందలాది మంది కుటుంబాలను తరలించారని బాధిత గిరిపుత్రులు వాపోతున్నారు. అంతేకాదు ప్లాంటులో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు..
పిల్లలకు విద్య కల్పిస్తామని చెప్పి వారిని కంపెనీ, రాష్ట్ర సర్కారు మోసం చేశాయి. ప్రస్తుతం ఇక్కడి వేదాంత ప్రాజెక్టు గిరిజనులను నిర్దాక్షిణ్యంగా అణగదొక్కే కేంద్రంగా మారిపోయింది. ఈ ఏడాది మార్చిలో వేదాంత అల్యూమినియం రిఫైనరీ వద్ద నిరసన చేస్తున్న గిరిజనులపై ఒడిషా ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(ఓఐఎస్ఎఫ్) నిర్దాక్షిణ్యంగా జరిపిన లాఠీచార్జీలో ఇద్దరు మరణించగా, 50 మందికి గాయాలయ్యాయి.
మానవ హక్కుల సంఘాల ఖండన
కార్యకర్తల అరెస్టును మానవ హక్కుల సంఘాలు, నాయకులు ఖండిస్తున్నారు. ఆయుధాల చట్టం, మావోయిస్టులతోన సంబంధాలు వంటి కేసులను బనాయించడం అన్యాయం, నిరాధారమని వారు అంటున్నారు. 'పదేండ్ల క్రితం నాటికి సంబంధించిన కేసుల్లో డోంగ్రి తెగ గిరిజనులను లక్ష్యంగా చేసుకొని అరెస్టు చేస్తున్నారు. అల్యూమినియం ప్లాంట్ రోడ్లను ప్రజలు దిగ్బంధనం చేసినందుకు, దాని కార్యకలాపాలను అడ్డుకున్నందుకు వారిని జైళ్లకు తరలిస్తున్నారు. పోలీసులు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వడం లేదు' అని దాధీ కర్దార్కా తరఫు న్యాయవాది సిద్దార్థ్ నాయక్ వెల్లడించారు.
నవీన్ హయాంలో గిరిజనులు తీరని అన్యాయం
కార్యకర్తలు, నాయకుల అరెస్టుల పర్వం.. ఒడిషా సర్కారు, వేదాంత కంపెనీ కుట్రలో భాగమని ఓ కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. డోంగ్రియా కోండ్ తెగ గిరిజనుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారనీ అన్నాడు. రెండు దశాబ్దాల నవీన్ పట్నాయక్ సర్కారు హయాంలో ఒడిషా గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపాడు. కాగా, కార్యకర్తలపై న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసు 27న విచారణకు రానున్నది. అయితే రాష్ట్ర సర్కారు, వేదాంత కంపెనీ ఎన్ని ఒడిదుడుకులు సృష్టించినా.. నియాంగిరి ప్రాంతంలో మైనింగ్కు ఒప్పుకునేది లేదని గిరిపుత్రులు స్పష్టం చేస్తున్నారు.