Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గేటు దూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు
- నేను ఏ నేరమూ చేయలేదు
- ఏఐసీసీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి
- ముగిసిన హైడ్రామా
- కావాలనే కేసులో ఇరికించారు : రాహుల్గాంధీ
న్యూఢిల్లీ : దాదాపు రోజున్నర డ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు అయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ 26 గంటల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. బుధవారం అకస్మాత్తుగా రాత్రి ఎనిమిది గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయనను సీబీఐ అధికారులు అరెస్టు చేసి ఆ సంస్థ హెడ్క్వార్టర్స్కు తరలించారు. అంతకు ముందు ఏఐసీసీ కార్యాలయంలో చిదంబరం మాట్లాడుతూ.. తాను ఏ నేరమూ చేయలేదనీ, ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రానా ఎవరూ నేరస్థుడు కాదని అన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. తనపై సీబీఐ, ఈడీకి చెందిన ఎలాంటి కేసులూ లేవని చెప్పారు. ఆ రెండు సంస్థల నుంచి తనపై ఎలాంటి ఛార్జ్షీట్ లేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో తనతో పాటు కుమారుడిపైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన ఎవరూ నేరస్థుడు కాదని చిదంబరం వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర పాటు మధ్యంతర బెయిల్పై ఉన్నాననీ, కానీ గడిచిన 24 గంటల్లో చాలా జరిగిందన్నారు. ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ఉందని తాను నమ్ముతున్నానని చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తాననీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చిదంబరం స్పష్టం చేశారు. కాగా, చిదంబరం ప్రత్యక్షమయ్యారనే వార్త తెలియగానే సీబీఐ అధికారులు ఆయన ఇంటి గోడను దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు హైడ్రామా నడిచింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత అనుచరులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. అనంతరం చిదంబరాన్ని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం సీబీఐ హెడ్క్వార్టర్స్కు తరలించారు. ఆయనను నేడు ఉదయం కోర్టు ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
సుప్రీంలో దక్కని ఊరట
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదరబరానికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టును తాత్కాలికంగా నిలిపివేసేం దుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్కు సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బుధవారం పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ ఎన్వీ రమణ ముందుకు వచ్చింది. అయితే దీనిపై తాను ఉత్తర్వులు జారీ చేయలేననీ ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో తాను తదుపరి ఆదేశాలు వెలువరించలేననీ, దీనిని ప్రధాన న్యాయమూర్తి రంజన్గొగోరుకు బదిలీ చేస్తానని తెలిపారు. చిదరబరం తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ టంఖ లు కోర్టులో హాజరయ్యారు. ఇదిలాఉండగా చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్పై రెండ్రోజుల తర్వాత (శుక్రవారం) విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు కేసుకు సంబంధించిన ఫార్మాలిటీలన్నీ పూర్తి చేస్తే దీనిని సీజేఐకి అందజేస్తానని ఎన్వీ రమణ.. కపిల్ సిబాల్కు సూచించారు. కాగా, ఈ కేసులో చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ఇది భారీ మనీ లాండరింగ్ కేసనీ, ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని ఆయన కోర్టుకు తెలిపారు.
కావాలనే కేసులో ఇరికించింది : రాహుల్గాంధీ
ఇదిలాఉండగా.. మాజీ మంత్రికి కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. రాజకీయ కక్షతోనే ఆయనను వేధిస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. చిదరబరం ప్రతిష్టను దిగజార్చేందుకే కేంద్రం ఆయనను ఈ కేసులో ఇరికించిందని ఆరోపించారు. ఇందుకోసం సీబీఐ, ఈడీ, పలు మీడియా సంస్థలను వాడుకుంటున్నదనీ అన్నారు. ఇది అధికార దుర్వినియోగమేనని విమర్శలు చేశారు.
మోడీ ప్రభుత్వ చర్యల్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఇదే విషయమై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందిస్తూ.. రాజకీయ కక్షతోనే చిదంబరం అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయన న్యాయ నిపుణుడనీ, కేసులను లీగల్గానే ఎదుర్కోగలరని స్టాలిన్ తెలిపారు.