Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశద్రోహం కేసులో అరెస్టు చేయరాదని ఆదేశం
న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) మాజీ విద్యార్థి నాయకురాలు, సామాజిక కార్యకర్త షెహ్లా రషీద్ షోరాకు ఢిల్లీలోని న్యాయస్థానం తాత్కాలిక ఊరటనిచ్చింది. దేశద్రోహం కేసులో ఆమెను నవంబర్ 5 వరకు అరెస్టు చేయరాదని తెలిపింది. ఈ మేరకు పాటియాలా హౌజ్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి పవన్కుమార్ జైన్ పోలీసులను ఆదేశించారు. కేసు దర్యాప్తులో భాగంగా సమగ్ర సమాచారం అవసరమనీ, దీనిని దృష్టిలో ఉంచుకొని తీర్పునిచ్చినట్టు న్యాయమూర్తి తెలిపారు. తదుపరి విచారణను నవంబర్ నెలకు వాయిదా వేశారు. షెహ్లా రషీద్ తరఫున న్యాయస్థానంలో సతీశ్ టామ్టా వాదించారు. ఆమె చేసిన ట్వీట్పై ఒక అడ్వకేటు.. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఫిర్యాదు చేశారన్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసులో షెహ్లారషీద్కు ఎలాంటి నోటీసులూ జారీ చేయలేదని అడిషనల్ ప్రాసిక్యూటర్ నివేదించినట్టు గుర్తుచేశారు. దర్యాప్తునకు షెహ్లా సిద్ధంగా ఉన్నదన్నారు. కాగా, ఈ కేసులో భారత ఆర్మీ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జడ్జి గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయడం కోసం పోలీసులకు దాదాపు ఆరువారాల సమయం పడుతుందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత ఆర్మీ అక్కడి స్థానికులపై క్రూరంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ షెహ్లా రషీద్ గతనెల 18 ట్వీట్ చేయగా.. ఆమెపై దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే.