Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణపేరిట ముగ్గురు మహిళలపై హింస - ఒకరికి గర్భస్రావం
- సమగ్ర నివేదిక కోరిన ఎన్హెచ్ఆర్సీ, ఎన్సీడబ్ల్యూ
గువహతి: అసోంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ముస్లిం మహిళలను పోలీసులు విచారణ పేరుతో బలవంతంగా దుస్తులు తీయించి మరీ విచక్షణారహితంగా కొట్టారు. ముగ్గురిలో ఒకరు గర్భవతి అనే విషయం మరిచిమరీ దాడి చేయడంతో ఆమెకు గర్భస్రావమైంది. స్థానిక మీడియాలో ఈ వార్తలు రావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)లు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేశాయి. ప్రస్తుతం మహిళల పరిస్థతితో పాటు, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను నాలుగు వారాల్లోగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాయి.
బాధితుల వివరాల ప్రకారం.. బాధితుల సోదరుడు రఫుల్ అలీ ఓ హిందూ అమ్మాయిని ప్రేమించి, తనతో తీసుకెళ్లినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 9న దరాంగ్ జిల్లా బుర్హాలోని వీరిని సబ్ ఇన్స్పెక్టర్ మహీంద్ర శర్మ విచారణ నిమిత్తం అర్ధరాత్రి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వారిని బట్టలు తీయించి, విచక్షణ రహితంగా కొట్టారనీ, తన సోదరికి గర్భస్రావం అయిందని బాధితుల్లో ఒకరు స్థానిక మీడియాకు వెల్లడించారు. అలాగే తమను పోలీసులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తచేశారు. తమ ప్రయివేటు భాగాలను తాకుతూ బూట్లతో, కర్రలతో కొట్టారని ఆరోపించారు. అలాగే తమతో ఖాళీ కాగితంపై సంతకం చేయించుకున్నారని తెలిపారు.