Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నెల 14 నుంచి దేశవ్యాప్తంగా..
- వేతనాలు, ప్రోత్సాహకాల్లో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ..
న్యూఢిల్లీ : ఈ ఏడాది మేలో ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ప్రచారాస్త్రంగా మారిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. వేతనాలు, ప్రోత్సహాకాలు, ఇంక్రిమెంట్ల విషయంలో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు తమకు మధ్య వ్యత్యాసం చూపిస్తున్నారని ఆరోపిస్తూ ఐదు, పదకొండో తరగతి ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈ మేరకు అక్టోబర్ 14 నుంచి సమ్మెకు దిగుతామనీ, ఈ నెల 30న యాజమాన్యానికి సమ్మెనోటీసులను అందజేస్తామని హెచ్చరించారు. ఆలిండియా హాల్ ట్రేడ్ యూనియన్స్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐహెచ్ఏఎల్టీయూసీసీ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న హాల్ ఉత్పత్తి, పరిశోధన సంస్థలకు చెందిన కార్మికులు సమ్మెలో ఉంటారని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు ఏఐహెచ్ఏఎల్టీయూసీసీ చీఫ్ కన్వీనర్ సూర్యదేవర చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల వేతనాల విషయంలో యాజమాన్యం కింది స్థాయి ఉద్యోగులపై వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. నష్టాల సాకు చూపి కార్మికులకు అన్యాయం చేస్తున్నారనీ, ఎగ్జిక్యూటివ్స్కు పెంచి తమకు మాత్రమే తగ్గించడానికి గల కారణాలేంటని ఆయన ప్రశ్నించారు. వేతనాల పెంపు, ఫిట్మెంట్ల విషయంలో.. ఎగ్జిక్యూటివ్స్కు 15 శాతం, 35 శాతం పెంచిన యాజమాన్యం.. కార్మికులకు 10 శాతం, 19 శాతం మాత్రమే పెంచిందని ఆరోపించారు. వేతన సవరణకు సంబంధించి కూడా 2017లోనే దాని గడువు ముగిసినా యాజమాన్యం మాత్రం దాని ఊసే మరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై హాల్ యాజమాన్యంతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదని చంద్రశేఖర్ అన్నారు. దీనిపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి డైరెక్టర్ వినరు మోహన్ చమోలా (వేతన సవరణ కమిటీకి ఆయన చైర్మెన్గా వ్యవహరిస్తారు)ను స్పందన కోరగా ఆయన మాట్లాడానికి నిరాకరించడం గమనార్హం.