Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు 20 లక్షల మంది అక్రమ లబ్దిదారులు
- ఆర్టీఐ సమాధానంతో వెలుగులోకి
న్యూఢిల్లీ : శిశువులు, వారి తల్లుల పోషకాహారం కోసం ఉద్దేశించిన అంగన్వాడీలు అక్రమాలకు నెలవుగా మారుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఒక్క అసోంలోనే దాదాపు 20 లక్షల మంది అక్రమ లబ్దిదారులను గుర్తించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అసోంలో 19.96 లక్షల మంది అక్రమ లబ్దిదారులను అంగన్వాడీ సర్వీసుల నుంచి తొలగించినట్టు ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా శిశుమహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, అంగన్వాడీ కేంద్రాల్లో లబ్దిదారుల సంఖ్యను తెలపాలంటూ అన్ని రాష్ట్రాలను కేంద్రం ఇటీవల కోరింది. అయితే దీనిపై ఇప్పటి వరకు అసోం నుంచి మాత్రమే సమాచారం అందింది. మిగతా రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉన్నది. అసోంలో 62,153 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 36,24,973 మంది లబ్దిదారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. పది కోట్ల మందికి పైగా లబ్దిదారులున్నారు.