Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ కధనాలకు భిన్నం : సామాజిక కార్యకర్త షబ్నమ్ హష్మి
శ్రీనగర్ : ప్రభుత్వం చెబుతున్న కధనాలకు భిన్నంగా కాశ్మీర్లో వాస్తవ పరిస్థితులున్నాయని సామాజిక కార్యకర్త షబ్నమ్ హష్మి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కోపంతో కాశ్మీర్ రగిలిపోతున్నదని ఆమె వ్యాఖ్యానించారు. కాశ్మీరీ ప్రజలు రోజువారీ జీవితంలో కోల్పోతున్న వాటిని, వారి భావోద్వేగాలను వెల్లడిస్తూ అక్కడి వాస్తవ పరిస్థితులపై షబ్నమ్ హష్మి ఒక నివేదికను రూపొందించారు. కాశ్మీర్లోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, వర్తకులు, రవాణా రంగానికి చెందిన వారు, పండ్ల వ్యాపారులు, టాక్సీ యూనియన్లు. విద్యార్ధులు, ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు, మేధావులు, ఉద్యోగులు, రచయితలు, రైతులు, జర్నలిస్టులు, కాశ్మీర్ పండిట్లు, సిక్కులు, క్రిస్టియన్లు ఇలా అన్ని వర్గాలకు చెందిన దాదాపు 350 మందిని షబ్నమ్ హష్మి తన బృందంతో వెళ్ళి ఇటీవల కలుసుకున్నారు. కాశ్మీర్లోని పరిస్థితులపై వారితో చర్చించారు. వారు చెప్పిన విషయాల ఆధారంగా దాదాపు 76 పేజీల నివేదికను రూపొందించారు. ఈ నివేదికను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. శాసనోల్లంఘన, మానసిక వేదన, తీవ్రవాదం, భయం, అనైక్యత, సిఫార్సులు, అనుబంధ అధ్యాయాలుగా జమ్ము కాశ్మీర్ పౌరులు, కార్గిల్ ప్రజల భావాలు, ప్రభుత్వ నోటీసులు తదితరాలను నివేదికలో చేర్చారు. శ్రీనగర్ నుంచి బారాముల్లా వరకు, అనంతనాగ్ నుండి బద్గామ్, జమ్మూ వరకు తాము కలిసిన ప్రతి ఒక్కరూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. అందువల్లే ఈ నివేదికను రూపొందించాల్సి వచ్చిందని చెప్పారు.
కాశ్మీర్లో పౌర స్వేచ్ఛను అణిచివేస్తూ సైనికుల మోహరింపు, ప్రధాన స్రవంతిలో ఉన్న రాజకీయ నాయకులతో పాటు వేర్పాటువాదుల అరెస్టు, కమ్యూనికేషన్ను దిగ్బంధించడం తదితరాలన్నీ రాష్ట్రంలో చోటు చేసుకున్న కొత్త పరిస్థితులను ప్రశాంతంగా ఉంచాయని, అత్యధికమంది ప్రజలు సంతోషంగా ఉన్నారని జాతీయ మీడియాను ఉపయోగించుకుని భారత ప్రభుత్వం ఒక కధనాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళింది. కాని దీనికి భిన్నంగా, పూర్తి వ్యతిరేకంగా కాశ్మీర్లో పరిస్ధితులు ఉన్నట్టు తాము తెలుసుకున్నామని నివేదికలో తెలిపారు.
కాశ్మీర్ కోపంతో రగిలిపోతున్నదని, ప్రజలు చెల్లాచెదురయ్యారని తమతో మాట్లాడిన ఒక జర్నలిస్ట్ చెప్పినట్టు ఆమె తెలిపారు. కాశ్మీర్లో హింస జరగలేదన్నది అవాస్తవమని అన్నారు. శాసనోల్లంఘనం ప్రతిరోజూ జరిగింది. భారత ప్రభుత్వం తమని తిరస్కరించింది, మోసగించిందన్న అభిప్రాయంలో కాశ్మీరీలు ఉన్నారని షబ్నమ్ పేర్కొన్నారు. కాశ్మీర్ భయాందోళనల్లో చిక్కుకుంది. వేధింపులు, అరెస్టులు, కఠినమైన ప్రజా భద్రత చట్టం కింద యువకుల నిర్బంధాలకు సంబంధించిన కధలెన్నో ఇక్కడ చోటుచేసుకున్నాయి. కాశ్మీర్ ప్రజలు భయాందోళనల్లో ఉన్నప్పటికీ ఈ దాష్టీకాన్ని ధిక్కరిస్తూ, దుకాణాలను మూసివేయించారు. మిలిటెంట్లు, వేర్పాటువాదులు, రాజకీయ నాయకుల పిలుపు మేరకు కాకుండా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యకు ప్రతిఘటనగా దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారని నివేదికలో షబ్నమ్ తెలిపారు. ఈ నివేదికను రూపొందించిన బృందంలో షబ్నమ్తో పాటు, లుథియానా రచయిత, సైకియాట్రిస్ట్ అనిరుధ్ కాలా, ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్, రచయిత రేవతి లాల్, ముంబయికి చెందిన విద్యావేత్త, ప్రజారోగ్య అధికారి, సామాజిక కార్యకర్త బ్రినెల్లె డి'సౌజా తదితరులు ఉన్నారు.