Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని సాంబా జిల్లాలో జమ్మూ-పఠాన్కోట్ రహదారిపై సరోరే వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్ప్లాజాను తొలగించాలని ప్రయివేటు ట్రాన్స్పోర్టుకు చెందిన వందలాది మంది వాహనదారులు, డ్రైవర్లు, కండక్టర్లు, స్థానికులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ను వెంటనే పరిష్కారించాలని కేంద్రాన్ని కోరారు. ఆందోళనకారులు టోల్ప్లాజా నుంచి స్థానిక జనరల్ బస్టాండ్ వరకు నిరసనలు తెలుపుతూ ర్యాలీ చేపట్టారు. కతువాలోనూ టోల్ప్లాజాకు వ్యతిరేకంగా 'కతువా బస్ సర్వీస్ అసోసియేషన్' సహా పలు సంఘాలు ఆందోళనలు చేశాయి. ఈ ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలతో పాటు బీజేపీ కార్యకర్తల నుంచి సానుకూల స్పందన రావడం గమనార్హం. తమకు అనుకూల నిర్ణయం రాకపోతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. టోల్ప్లాజా వద్ద సింగిల్ క్రాసింగ్కు సైతం రూ.225 వసూలు చేస్తున్నారని తెలిపారు. అలాగే డ్రైవర్లను, కండక్టర్లను, ప్రయాణికులను టోల్ప్లాజా కాంట్రాక్టరు, సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 'బీమా, పర్మిట్, ట్రాఫిక్ జరిమానాలు, ఇంధన ధరల పెంపు కారణంగా టోల్ టాక్స్ చెల్లించే స్థితిలో లేమ'ని బస్ యూనియన్ అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్లో ఆంక్షలు విధించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేసి 'జిజియా పన్ను వసూలు' చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ జోక్యం చేసుకోవాలని కోరారు. గవర్నర్తోపాటు, కేంద్రానికి ఆందోళనకారులు లేఖలు రాశారు. ఈ నెల 11న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సరోరే టోల్ప్లాజాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.