Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముంబయి చీఫ్ విద్వేష ప్రసంగం
ముంబయి : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ముంబయి చీఫ్ మంగళ్ ప్రభాత్ లోధా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ముంబాదేవి నియోజకవర్గం నుంచి శివసేన-బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పాండురంగ సక్పాల్కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొని ఓ ర్యాలీలో మాట్లాడారు. సమీపంలోని ముస్లిం జనాభా అధికంగా ఉండే డోంగ్రి, నాగ్పడా ఏరియాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. '1992 అల్లర్లకు తర్వాత ముంబయిలో ఎన్ని బాంబులు, తూటాలు పేలాయన్నది గుర్తుంచుకోండి. ఆ పేలుడు పదార్థాలన్నీ ఎక్కడ తయారయ్యాయి? ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లోనే తయారయ్యాయి. ఆ ఏరియాలోని వారి ఓట్లతో గెలిచిన నేత మీ యోగ క్షేమాలు ఎలా చూస్తాడు. కేంద్రం, రాష్ట్రం, మున్సిపల్ కార్పొరేషన్లోనూ బీజేపీ, శివసేన అలయెన్స్ అధికారంలో ఉన్నది. మీరు ప్రత్యర్థి(సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిన్ పటేల్)కి ఓటేస్తే.. వారు నడిమధ్యలో జెండా ఎగరేస్తారు. దాన్ని మేం ఎలా స్వీకరిస్తాం? ఇక్కడ హిందూ మరాఠాలపై వివక్ష చూపిస్తున్నారు. పాత భవంతులు కూలినప్పుడు మీకు సమీపంలోని సహాయక శిబిరాల్లోకి పంపించకుండా దూరమెందుకు పంపిస్తారు? ఈ శిబిరాలు ప్రత్యేకంగా మరో వర్గం కోసమేనా?' అని ప్రసంగించారు. దీనిపై సక్పాల్ స్పందిస్తూ.. అవి ఆయన సొంత అభిప్రాయాలు అని కొట్టివేసే ప్రయత్నం చేశారు. కాగా, కూలిన పాత బిల్డింగ్లోనివారి కోసం 50వేల తాత్కాలిక శిబిరాలను నిర్మించాల్సిందిగా రాష్ట్రంలోని బీజేపీ సర్కారుకు మొరపెట్టుకున్నా.. ఒక్కటి కూడా నిర్మించలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే అమిన్ పటేల్ అన్నారు.