Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాల పెంపు, ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ డిమాండ్
షిల్లాంగ్: తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న మేఘాలయ జీవీకే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) అంబులెన్స్ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరింది. మేఘాలయ ఈఎంఆర్ఐ వర్కర్స్ యూనియన్ (ఎంఈఎంఆర్ఐడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ సమ్మెలో సుమారు 200మందికి పైగా అంబులెన్స్ డ్రెవర్లు, సంబంధిత వర్కర్లు పాల్గొన్నారు. జీవీకే ఈఎంఆర్ఐతో ఉన్న ఒప్పందాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసి, అత్యవసర సేవలకు సంబంధించిన సంస్థలను రాష్ట్ర ప్రభుత్వమే నడపాలనేది వీరి ప్రధాన డిమాండ్లు. వీటితో పాటు వేతనాల పెంపు, పని విభజన వంటి పలు డిమాండ్లు కూడా ఉన్నాయి. కాగా, సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న కార్మికులపై ఎస్మా చట్టం కూడా ప్రయోగించింది. అయినప్పటికీ కార్మికులు ఐక్యమత్యంగా తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఈఎంఆర్ఐడబ్ల్యూయూ అధ్యక్షుడు రోయిపర్ ఖరస్వారు మాట్లాడుతూ.. 18రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ తమను ప్రభుత్వం ఎలాంటి చర్చలకూ పిలవలేదని వెల్లడించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. సమ్మె వల్ల ప్రజలకు కొంతమేర అసౌకర్యం కలుగుతున్నప్పటికీ తమకు వేరే మార్గం లేదన్నారు. తమ డిమాండ్లను అంగీకరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ సమ్మెపై రాష్ట్ర ముఖ్యమంత్రి కోన్రాడ్ కె.సంగ్మా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అంబులెన్స్ సేవల నిర్వహణను చేపట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కానీ వేతన పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు.