Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థాయీ సంఘం మల్లగుల్లాలు
- శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందే యోచనలో మోడీ సర్కార్
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ అమలులో ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ల కిందికి తేవాలని మోడీ సర్కార్ సంకల్పించింది. అందులో భాగంగా వర్షాకాల సమావేశాల్లో వేతన కోడ్ బిల్లుకు ఆమోదం పొందింది. వేతన కోడ్లోకి గతంలో ఉన్న నాలుగు చట్టాలను విలీనం చేశారు. ఇప్పుడు వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ (ఓఎస్హెచ్ కోడ్) బిల్లు-2019పై మోడీ సర్కార్ దృష్టి సారించింది. దీని ద్వారా ఇప్పటివరకూ అమలులో ఉన్న 13 కార్మిక చట్టాలు ఒకే కోడ్ కిందికి రానున్నాయి. ఇందులో పరిశ్రమలు, తోటలు, వాహనాలు, బీడీ, సినిమా, నౌకాశ్రమాల్లో పని చేసే కార్మికుల అంశాలు చేరనున్నాయి.
ఓఎస్హెచ్ కోడ్ బిల్లును కూడా ఈ ఏడాది జులైలోనే కార్మికశాఖమంత్రి సంతోష్గ్యాంగ్వార్ లోక్సభలో ప్రవేశపెట్టగా, పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపారు. ఓఎస్హెచ్ బిల్లుకు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందాలని మోడీ సర్కార్ భావిస్తుండగా, దీనిపై సమీక్షకు మరింత సమయం కావాలని స్థాయీ సంఘం సభ్యులు చెబుతున్నారు. దీనిపై మొదటి సమావేశాన్ని అక్టోబర్ 25న నిర్వహించనున్నట్టు స్థాయీ సంఘం చైర్మన్, బీజేడీ ఎంపీ భర్తృహరి మెతాబ్ తెలిపారు. మొదటి భేటీలో కేంద్ర కార్మికశాఖతో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై సమీక్షకు లోక్సభ స్పీకర్ తమకు మూడు నెలల సమయమిచ్చారని ఆయన తెలిపారు. అయితే, ఈ అంశం సంక్లిష్టమైనది కావడంతో శీతాకాల సమావేశాల్లోగా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు పూర్తి కాకపోవచ్చని ఆయన అన్నారు. ఒకటి,రెండు చోట్ల క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తెలుసుకోవాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాలు నవంబర్ మధ్యలో ప్రారంభమై క్రిస్టమస్ సెలవుల వరకల్లా ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయాలన్న ఆతృత ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. 370 అధికరణం రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దులాంటి బిల్లులకు రాజ్యసభలోనూ ఆమోదం సాధించిన మోడీ సర్కార్లో ఆత్మవిశ్వాసం బలపడినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.