Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నుంచి అత్యధికంగా 155 మంది
- మహారాష్ట్ర ఎలక్షన్ వాచ్, ఏడీఆర్ల నివేదిక
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వెయ్యిమందికి పైగా కోటీశ్వరులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇటీవల మహారాష్ట్ర ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)లు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించాయి. ఈ నివేదిక ప్రకారం. నామినేషన్ దాఖలు చేసిన 3112 మంది అభ్యర్థులలో 1007 మంది కోటీశ్వరులు ఉన్నారనీ, అలాగే 59 మందికి ఎలాంటి ఆస్తులూ లేవని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. బీజేపీ నుంచి పోటీచేస్తున్న 162 మంది అభ్యర్థుల్లో అత్యధికంగా 155 మంది కోటీశ్వర్లేనని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 147 మంది అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులున్నారు. అలాగే శివసేనలోని 124మంది అభ్యర్థుల్లో 116మంది, ఎన్సీపీలోని 116మందికి గానూ 101మంది, ఎంఎన్ఎస్ నుంచి బరిలో ఉన్న 99మంది అభ్యర్థులలో 52 మందికి కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులున్నట్టు నివేదిక తెలిపింది. ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ .4.21 కోట్లకు పైనేనని తెలిపింది. కాగా, పార్టీల వారీగా అభ్యర్థుల ఆస్తుల సగటు వివరాలు.. బీజేపీ రూ. 23.58 కోట్లు, కాంగ్రెస్ 14.78 కోట్లు, శివసేన రూ .12.57 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. అలాగే ఎన్సీపీ రూ. 11.43 కోట్లు, ఎంఎన్ఎస్ అభ్యర్థులు సగటు ఆస్తి రూ.2.29 కోట్లు, 1,359 మంది స్వతంత్ర అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ. 1.71 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ప్రతి ముగ్గురు కోటీశ్వరులైన అభ్యర్థుల్లో ఇద్దరు బీజేపీ అభ్యర్థులే కావడం గమనార్హం. 'మహా'ఎన్నికల్లో పోటీ చేస్తున్న 3,237 మంది అభ్యర్థులలో 3,112 మంది అఫిడవిట్ల ఆధారంగా మహారాష్ట్ర ఎలక్షన్ వాచ్, ఎడీఆర్లు ఈ నివేదికను తయారు చేశాయి. మిగిలిన అభ్య ర్థుల వివరాలు సంపూర్ణంగా లేవని తెలిపింది.