Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్
న్యూఢిల్లీ : 'ఒకప్పుడు విజిలెన్స్ చీఫ్ కమిషనర్ ఇప్పుడు భారతదేశ అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ బోర్డులోని డైరెక్టర్! ఆ కంపెనీకి సంబంధించి ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలన్నిటిపై దర్యాప్తు చేయాలి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రజాధనంతో మరింత సంపన్నులుగా చేస్తున్నది' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)లో స్వతంత్ర డైరెక్టర్గా కె.వి. చౌదరి నియమి తులవడంపై ఆయన శనివారం ఈ మేరకు ట్వీట్ చేశారు.
చౌదరి రిలయన్స్ డైరెక్టర్ ఎందుకయ్యారు?
అవినీతి నిరోదక శాఖ మాజీ అధికారి, మోడీ ప్రభుత్వంలో పన్నుల శాఖకు మొట్టమొదటి అధికారిగా పనిచేసిన చౌదరికి ఆర్ఐఎల్లో ఈ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. క్రోనీ క్యాపిటలిస్టులకూ కేంద్రంలోని ప్రభుత్వాలకూ మధ్య ఉన్న అనుబంధం, ఏటా లక్షల కోట్ల రూపాయలను వారికి రాయితీలుగా ఇవ్వడం, బ్యాంకు రుణాలను మాఫీ చేయడం అందరికీ తెలిసిందే. ప్రభుత్వంలో అవినీతి నిరోదక అధికారులుగా, కీలక అధికారులుగా ఉండి కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడం, వారి పదవీ విరమణ తరువాత కీలక బాధ్యతలు అప్పగించడం ఇటీవల కాలంలో పెరిగిపోయిందనే విమర్శలున్నాయి.
శుక్రవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో చౌదరిని అడిషనల్ డైరెక్టర్ (నాన్ ఎగ్జిక్యూటివ్)గా నియమించినట్టు రిలయన్స్ సంస్థ తెలిపింది. 1978 బ్యాచ్కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన చౌదరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మెన్గా 2014లో నియమితులయ్యారు. 2015లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కమిషనర్గా పనిచేశారు. చౌదరి పదవీ విరమణ పొందిన తరువాత నల్లధనానికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖకు సలహాదారుగా నియమితులయ్యారు. కేంద్రంలో ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనకు రిలయన్స్లో పదవి దక్కడం చర్చనీయాంశమైంది. ఆయన తన హయాంలో తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.