Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1990 నుంచి రెట్టింపైన విపత్తులు
- అరికట్టకుంటే.. ఆకలి కేకలు తీవ్రం
- వ్యవసాయ ఉత్పాదకత, పౌష్టికాహారంపైనా ప్రభావం : హంగర్ ఇండెక్స్లో వెల్లడి
న్యూఢిల్లీ : పర్యావరణ మార్పులు పెను ప్రమాదాలను సృష్టించనుంది. ఇప్పటికే అనేక దేశాల్లో కోట్లల్లో ప్రజలు ఆకలితో కొట్టుమిట్టాడుతుండగా.. ఈ మార్పులు ఆహార ఉత్పాదకతపై ప్రభావం వేస్తాయని తేలింది. అంతేకాదు, ఆహారంలోని పోషకాలు తగ్గించడంతో పౌష్టికాహారలోపానికి కారణమవుతుందని ఓ నివేదిక వెల్లడించింది. భూతాపం, కార్బన్ డై ఆక్సైడ్ల వల్ల పర్యావరణంలో కలిగే మార్పులతో ప్రకృతి వైపరిత్యాలు విజృంభిస్తాయనీ, ఆహారం లభించక ఆకలి కేకలు పెరుగుతాయని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అధ్యయనం హెచ్చరించింది. పర్యావరణ మార్పులను బడా దేశాల నేతలు తేలికగా తీసుకుంటున్నప్పటికీ ఇది ప్రజలకు ప్రాణ సంకటంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఏడాది గ్లోబల్ హంగర్ ఇండెక్స్.. ఆకలి సమస్యలకు కారణాలను వివరిస్తూ దేశాల జాబితాతోపాటు ఓ విశ్లేషణనూ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది విడుదల చేసిన వ్యాసంలో ఆకలికి కారణాలను వివరిస్తూ.. ప్రపంచ ఆహార ఉత్పాదకత, పోషకాలపై పర్యావరణ మార్పులు వేస్తున్న ప్రతికూల ప్రభావాన్ని వివరించింది. 1990 దశకం నుంచి వాతావరణ సంబంధిత విపత్తులు రెట్టింపయ్యాయనీ, ఇవి ప్రధాన పంటలను ప్రభావితం చేసి ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలకు, ప్రజల ఆదాయాలు పడిపోవడానికి కారణమయ్యాయని తెలిపింది. పర్యావరణ మార్పుల పెను ప్రభావాలు ముఖ్యంగా పేద దేశాలపైనే తీవ్రంగా ఉంటాయని వివరించింది.
పోషకాలపై ప్రభావం :
పర్యావరణ మార్పులు ఆహారంలోని పోషకాలనూ ప్రభావితం చేస్తాయి. పెరిగిన కార్బన్ డై ఆక్సైడ్తో పంటల్లోని ప్రోటీన్లు, జింక్, ఐరన్ మోతాదులు పడిపోతాయి. దీంతో 2050కల్లా దాదాపు 17.5 కోట్ల మంది ప్రజలకు ఆహారంలో జింక్ అందదు. 12.2 కోట్ల మంది ప్రజలు ప్రోటీన్లకు దూరమవుతారు. ఇందులోనూ పేదరికంలో జీవిస్తున్నవారు ఈ సమస్యకు లోనయ్యే అవకాశమెక్కువ. దక్షిణ, దక్షిణాసియా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉండనున్నట్టు నివేదిక తెలిపింది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా లేని ఈ దేశాల ప్రజలు పర్యావరణ మార్పు ప్రతికూలతల బారిన సులువుగా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే.. భూతాపాన్ని అడ్డుకుని పర్యావరణ మార్పులను నిలువరించేందుకు పారిస్ ఒప్పంద లక్ష్యాలను ప్రపంచ దేశాలు తప్పక ఛేదించాలని నివేదిక సూచించింది. కానీ, బడా దేశాలు తగినరీతిలో స్పందించడం లేదు. సామూహిక జీవనం కాక.. వ్యక్తివాదాన్ని మోసే పెట్టుబడిదారీ దేశాలు ఈ సమస్యపై జవాబుదారీగా వ్యవహరించడం లేదు. అమెజాన్ అడవులు తగులబడుతుంటే.. మా దేశం మా ఇష్టం అంటూ బ్రెజిల్లో అధికారంలోని మితవాద నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించినా దాని దుష్ఫలితాలు యావత్ ప్రపంచం అనుభవించక తప్పదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా భూతాపాన్ని, బొగ్గుపులుసు వాయువులను నియంత్రించి పర్యావరణ మార్పులను అదుపులో పెట్టుకోకుంటే.. సర్వమానవాళికి ప్రమాదమేనని చెబుతున్నారు.
పర్యావరణ మార్పులు.. ఆహార భద్రత
పర్యావరణ మార్పులతో ఆహార ఉత్పత్తితోపాటు, ఆహారంలోని పోషకాల విలువలు పడిపోతాయి. ప్రధాన పంటలు మొక్కజొన్న, గోధుమ సాగు ఇప్పటికే తగ్గింది. ఎడారి, మైదాన ప్రాంతాల్లోని పంటల్లో దాదాపు 80శాతం మార్పులకు ప్రధాన కారణం క్లైమేట్ చేంజ్నే అని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) తెలిపింది. చిన్న దీవుల్లో ఇది మరింతగా విరుచుకుపడుతంది. ఉదాహరణకు వియత్నాంలోని డెల్టా మెకాంగ్లో వరి అధికంగా సాగవుతుంది. ఆ దేశం 50శాతం ఆహారానికి ఈ డెల్టాపైనే ఆధారపడుతుంది. కానీ, పర్యావరణ మార్పులతో సముద్ర నీటి ఉపరితలం పెరిగితే.. ఈ డెల్టాపై సాగు అసాధ్యమే. కాగా, ప్రపంచంలోని 80శాతం ప్రకృతి వైపరిత్యాలు పర్యావరణ మార్పులకు సంబంధించినవే. 2011-16 కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక విపత్తులు సంభవించాయి. వీటి వల్ల 51దేశాల్లోని 12.4 కోట్ల మంది ప్రజలు ఆహారం కోసం నానాతిప్పలు పడ్డారు. 2015-16లోనూ ఎల్నినో వల్ల ఎల్సాల్వడార్, గ్వాటెమాల, హౌండురాస్లాంటి దేశాల్లోని 50-90శాతం పంటలు దెబ్బతిన్నాయి.