Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలకోట్లు నిధులు ఇవ్వలేమంటున్న రాష్ట్రాలు
- అన్నా వర్సిటీ, జాదవ్పూర్ వర్సిటీల విషయంలో అనాసక్తి
- వర్సిటీ విద్యను ప్రయివేటీకరించే ప్రమాదం : విద్యావేత్తలు, ప్రొఫెసర్లు
న్యూఢిల్లీ : విశ్వవిద్యాలయాలకు 'విశిష్ట' హోదా కల్పిస్తాం, ఓ రెండువేల కోట్ల రూపాయలు తెచ్చుకోండి అంటూ కేంద్రం తెరపైకి తీసుకొచ్చిన పథకం విమర్శల పాలైంది. విదేశీ ప్రయివేటు వర్సిటీల మాదిరిగా విద్యను మార్కెట్మయం చేయడం కోసం, రిజర్వేషన్లను దెబ్బకొట్టడం కోసం ఈ తరహా పథకాలు తెరమీ దకు తెస్తున్నారనీ విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం, వర్సిటీకి 'విశిష్ట' హోదా రావాలంటే రూ.3000కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. వర్సిటీ అభివృద్ధి కోసం ఈ నిధులు ఖర్చు చేస్తామని కేంద్రం చెబుతోంది. తన వంతుగా రూ.1000 కోట్లు ఇస్తానంటోంది. మిగతా 2వేల కోట్లు వర్సిటీలు స్వయంగా ఏర్పాటుచేసుకోవాలనీ లేదా రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలనీ కేంద్రం సూచించింది.
ఈ నేపథ్యంలో జాదవ్పూర్ వర్సిటీ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ.2వేల కోట్లు ఇవ్వటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలిసింది. తమిళ నాడులోని అన్నా యూనివర్సిటీకి కూడా కేంద్రం 'విశిష్ట' హోదా ప్రతిపాదనలు పంపింది. రూ.1750కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, విశిష్ట హోదా కల్పించి...వర్సిటీని అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది.
ఈ హోదా విషయంలో తమిళనాడు వెనక్కి వెళితే, సావిత్రిభాయి ఫూలె వర్సి టీ(మహారాష్ట్ర), అలీఘర్ వర్సిటీలకు ప్రతిపాదనలు పంపుతామని కేంద్రం తెలి పిందట. ఈ పథకం అమలు చేయడం వల్ల, వర్సిటీకి విదేశీ విద్యార్థులు, విదేశీ ప్రొఫెసర్లు వస్తారని చెబుతోంది. తద్వారా అంతర్జాతీయంగా వర్సిటీకి పేరు ప్రఖ్యాతలు వస్తాయని కేంద్రం భావిస్తోంది. అయితే వర్సిటీలోని పలువురు విద్యా వేత్తలు ఈ హోదా విషయంపై పెదవి విరిస్తున్నారు. జాదవ్పూర్ వర్సిటీ వీసీ సురంజన్దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వర్సిటీని ఆదుకోవాల్సింది పోయి, కొత్తగా ఈ పథకం తీసుకొచ్చి పెద్ద ఎత్తున భారం మోపుతున్నారనీ, ఒక్కో వర్సిటీకి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయనీ, వాటిని కోల్పోయే ప్రమాదముందనీ ఆయన అన్నారు.
ఫీజుల మోత మోగించరన్న భరోసా లేదు!
'విశిష్ట' హోదా అనే కాన్సెప్ట్ విదేశాల నుంచి అరువుతెచ్చుకున్న ఆలోచనగా కొంతమంది విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. అమెరికాలో ప్రయివేటు వర్సిటీల వ్యవస్థను చూసి కేంద్రం ఈ పథకాన్ని తయారుచేసిందన్న మాటలు వినపడు తున్నాయి. హార్వార్డ్, స్టాన్ఫోర్డ్, యాలే, ప్రిన్స్టన్...మొదలైన ప్రఖ్యాత ప్రయి వేటు వర్సిటీలను మోడల్గా చూపి తెరపైకి తీసుకొచ్చిన పథకంగా 'విశిష్ట' హోదా కనపడుతోంది. ఈ వర్సిటీలో పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయటంతో, అమెరికన్లు సైతం వీటివైపు చూడటం లేదని తెలిసింది.
రిజర్వేషన్లను దెబ్బకొట్టే ఎత్తుగడ! విద్యావేత్త ప్రిన్స్ గనేంద్రబాబు, తవిలుళనాడు
అన్నా వర్సిటీకి సంబంధించి ప్రత్యేకమైన 'రెగ్యులేటరీ' ఉంది. 69 శాతం రిజర్వేషన్లు అమలుజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. అంతర్జాతీయంగా కూడా అన్నా వర్సిటీకి మంచి గుర్తింపు ఇప్పటికే ఉంది. ఈనేపథ్యంలో 'విశిష్ట' హోదా అనేదాన్ని తీసుకొచ్చి మార్పులు చేయటాన్ని మాత్రం ఒప్పుకోం. రిజర్వేషన్లు ఎత్తేసే ఎత్తుగడ ఇందులో ఉంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ దిశగా వర్సిటీలను నడిపించే ప్రయత్నమిది. 2015 నుంచి కేంద్రం విద్యా సెస్సు వసూలు చేస్తోంది. ఆ నిధులు ఏమయ్యాయో కేంద్రం చెప్పాలి. పాశ్చాత్య దేశాల విద్యా విధానం అమలుజేస్తామంటే ఒప్పుకోం. వర్సిటీ విద్యను మార్కెట్ మయం చేసే ఎత్తుగడ ఇందులో ఉంది.