Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 21న చలో పార్లమెంట్
- భూమి అధికార్ ఆందోళన్ పిలుపు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ హక్కులను కాలరాయడంపై మేధావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల రక్షణ కోసం పాలకులు గిరిజన, ఆదివాసీ ప్రజానీకం జీవితాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై నవంబర్ 21న భూమి అధికార్ ఆందోళన్ ఛలో పార్లమెంట్కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజానీకం, విద్యార్థులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మాట్లాడుతూ... కేంద్ర అటవీ హక్కు చట్టానికి ఇబ్బందికర సవరణలు తీసుకోస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సవరణలకు వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా భూమి అధికార్ ఆందోళన్ దాదాపు 300 వరకూ నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. తమ నిరసనల ఫలితంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సవరణలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు వివరించారు. కానీ, అటవీ హక్కులు కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైదని విమర్శించారు. ఆదివాసీల హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వమే పెట్టుబడిదారుల కోసం పని చేస్తున్నదని ఆరోపించారు. ఇటీవల మధ్యప్రదేశ్, యూపీలో ఆదివాసీలపై కాల్పులు జరిపి పోలీసులు పొట్టనబెట్టుకున్నారని అయినా కేంద్రం కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వీటన్నింటికీ నిరసనగా తాము చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు హన్నన్ మొల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ చౌదరీ, రోమా మాలిక్, ప్రేమ్ సింగ్ గేహ్లాట్ తదితరులు పాల్గొన్నారు.