Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి 15 నాటికి కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న అసాంఘిక, అశ్లీలత, దేశద్రోహం, నకిలీ వార్తలను నియంత్రించడానికి కేంద్రం నూతన మార్గదర్శకాలను రూపొందించనున్నది. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి మార్గదర్శకాల రూపకల్పన పూర్తవుతుందనీ, వెంటనే వాటిని అమలు పరుస్తామని మంగళవారం సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఉగ్రవాదాన్ని రేకెత్తించే, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యలు, విద్వేషపూరిత, నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం ఈ కేసును జస్టిస్ దీపక్ గుప్తా, అనిరుద్ద బోస్లతో కూడిన ధర్మాసనం విచారిస్తున్నది. సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని ఈ ధర్మాసనం గత నెల 24న కేంద్రానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ ధర్మాసనానికి అఫిడవిట్ అందజేశారు. వచ్చే జనవరి 15 లోగా సవరించిన మార్గదర్శకాలను రూపొందించి, అమల్లోకి తీసుకవస్తామని తెలిపారు.
భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా ఇష్టానుసారంగా విద్వేషపూరిత, మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు వ్యాప్తిచెందుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత గోప్యత, దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని వీడియో క్లిప్పింగులను ఇష్టానుసారంగా పోస్ట్ చేయడం వల్ల సామాజిక పరమైన సమస్యలు తలెత్తున్నాయని తెలిపారు. ఇలాంటి చర్యలే ప్రజాస్వామ్య మనుగడ ను ప్రమాదంలోకి నెట్టి వేస్తాయని హెచ్చరించారు.
అలాగే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింక్ చేయాలని వివిధ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లను విచారణకు వీలుగా తర్వలోనే సుప్రీంకోర్టుకు బదిలీ చేయనున్నారు.