Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-- నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీపై మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ : ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ విజయాలను చూసి దేశం గర్విస్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని మోడీ నివాసంలో తనను కలిసిన అభిజిత్లో ఆయన కాసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంగా మోడీ ట్వీట్ చేస్తూ.. 'నోబెల్ గ్రహీత అభిజిత్తో అద్భుతమైన భేటీ జరిగింది. మానవ సాధికారతపై ఆయనకున్న తపన తన మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. పలు అంశాలపై మేం చర్చించుకున్నాం. ఆయన సాధించిన విజయాలను చూసి దేశం గర్విస్తున్నది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలూ విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు. భేటీ అనంతరం అభిజిత్ స్పందిస్తూ.. తనకు సమయమిచ్చిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశాభివృద్ధికి సంబంధించి మోడీకి ఉన్న ఆలోచన విధానాన్ని ఆయన అభినందించారు. కాగా, నోబెల్ పొందిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థపై అభిజిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆయనను వామపక్ష భావజాలం ఉన్నవాడిగా ఆరోపించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది.