Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతిక కారణాలు చూపుతూ పక్కన పెట్టిన హైకోర్టు
- మరోసారి రుజువు చేసుకోవాలంటూ57మందికి ఆదేశం
గౌహతి:అసోంలో జాతీయ పౌరపట్టిక(ఎన్ఆర్సీ) ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్టుగా లేదు. ఈ ఏడాది ఆగస్టు 31న విడుదల చేసిన ఎన్ఆర్సీ తుది జాబితాలో 19 లక్షలమంది పేర్లు కనిపించకపోవడంతో వారంతా బాధితులుగా మారారు. ఎన్ఆర్సీ ప్రక్రియ పట్ల అవగాహన లేని కారణంగా కూడా పలువురు బాధితులుగా మారినట్టు పరిశోధించినాకొద్దీ అర్థమవుతోంది.
తాము నిజమైన దేశ పౌరులే అయినా సాంకేతిక కారణాలతో ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కనివారు విదేశీ ట్రిబ్యునళ్లను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించారు. 2017 జనవరిలో, 2018 ఫిబ్రవరిలో మోరిగాన్ జిల్లాలోని విదేశీ ట్రిబ్యునల్ 57మందిని అసోం పౌరులుగా ప్రకటిస్తూ తీర్పులు ఇచ్చింది. ఆ తర్వాత వీటిపై సమీక్షించిన గౌహతి హైకోర్టు.. ట్రిబ్యునల్ తీర్పులను పక్కన పెట్టింది. అందుకు సాంకేతిక కారణాలను హైకోర్టు ఉటంకించింది. ఈ తీర్పు ఈ ఏడాది సెప్టెంబర్ 19న వెల్లడైంది. దాంతో, ఈ 57మంది మరోసారి బాధితులుగా మారారు.
బాధితుల్లో 85 ఏండ్ల అంజద్అలీ, ఆయన కుటుంబసభ్యులున్నారు. అలీకి 11మంది వారసులుండగా, వారి సంతానం 20మంది వరకూ ఉన్నారు. వీరందరూ ఈ ఏడాది ఆగస్టు 31న ప్రకటించిన జాబితాలో పౌరసత్వం పొందినవారే. ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా వారి పేర్లు జాబితాలో చేర్చారు. 1997 నుంచి అలీ కుటుంబం పౌరసత్వం కోసం పోరాడుతోంది. ఓటర్ జాబితాలో అలీ పేరు పక్కన 'డీ' గుర్తు పెట్టడంతో సమస్య మొదలైంది. డీ గుర్తు ఉన్నవారంతా అనుమానాస్పద ఓటర్లని అర్థం. ట్రిబ్యునల్ నుంచి సానుకూల తీర్పు తెచ్చుకునేసరికి రూ.3 లక్షల వరకూ ఖర్చయినట్టు అలీ కుటుంబం తెలిపింది. తమకున్న పొలాల్నీ, రెండు ఆవుల్నీ, ఓ ఆటోరిక్షాను అమ్మాల్సి వచ్చిందని అంజద్అలీ కుమారుడు అస్ఘర్అలీ తెలిపారు. అలీ కుటుంబం విషయంలో 2007లో విదేశీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రద్దు చేయకపోవడాన్ని కారణంగా హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. 2017లో వచ్చిన తీర్పుకు అనుగుణంగా పాత తీర్పును రద్దు చేయకపోవడమన్న కారణంతో అలీ కుటుంబం మరోసారి లీగల్ పోరాటం చేయాల్సి వస్తోంది.
డీ ఓటర్గా నమోదైన 60 ఏండ్ల పచార్అలీ కేసు మరో విధంగా ఉన్నది. రెండు దశాబ్దాల లీగల్ పోరాటం తర్వాత 2018లో పచార్అలీని నిజమైన పౌరుడిగా గుర్తిస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అయితే, ఈయన కుటుంబం ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా ఎన్ఆర్సీలో పేర్లు నమోదు చేయించుకోలేదు. దాంతోపాటు ట్రిబ్యునల్ తీర్పులో కుటుంబసభ్యుల పేర్ల విషయంలో అక్షర దోషాలను చూపుతూ హైకోర్టు వీరిని మరోసారి రుజువు చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. పచార్అలీకి ఆరుగురు సంతానం. వారికి మరో 12మంది వరకూ పిల్లలున్నారు. ఇప్పుడు వీరంతా బాధితులుగా మారారు.
47 ఏండ్ల అబూతాలెబ్ కేసు విచిత్రమైంది. డీ ఓటర్గా నమోదైన ఈయన 2009 నుంచి లీగల్ పోరాటం చేస్తున్నారు. 2018, ఫిబ్రవరిలో ట్రిబ్యునల్ ఈయన్ని నిజమైన భారత పౌరుడుగా తీర్పు ఇచ్చింది. అయితే, గతంలో ఓసారి డీ ఓటర్ జాబితాలో ఉన్న ఈయనపై సరిహద్దు పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ సమయంలో ఈయన ఆచూకీ కనుగొనలేకపోయిన పోలీసులు చనిపోయినట్టుగా ట్రిబ్యునల్కు ఇచ్చిన నివేదికలో తెలిపారు. అయితే, తాలెబ్కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ట్రిబ్యునల్, గతంలో తమకు అందిన నివేదికను తప్పుగా తేల్చకపోవడాన్ని హైకోర్టు కారణంగా చూపింది. ఇప్పటికే రూ.లక్ష వరకూ ఖర్చయిందని తాలెబ్ చెబుతున్నారు. దినసరి కూలీయైన తాలెబ్ మరోసారి లీగల్ పోరాటానికి ఆసక్తి చూపడంలేదు. జీవితం పట్ల విరక్తితో ఆయన ఆవేదన చెందుతున్నారు. ఇద్రిస్ అలీ, ఆయన భార్య అక్లీమా ఖాటూన్ కూడా డీ ఓటర్ బాధితులే. వీరికి అనుకూలంగా 2017లో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. 2018లో ప్రకటించిన ఎన్ఆర్సీ జాబితాలో వీరి పేర్లు కూడా నమోదయ్యాయి. తాజా జాబితాలో పేర్లు తొలగించారు. హైకోర్టు తీర్పులోనూ వీరి విషయంలో సాంకేతిక కారణాలు చూపారు. గతంలో ట్రిబ్యునల్ వీరిని విదేశీయులుగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పును 2017 తీర్పుకు అనుగుణంగా రద్దు చేయకపోవడాన్ని హైకోర్టు కారణంగా చూపింది. కూలీలుగా బతుకుతున్న వీరు మరోసారి లీగల్ పోరాటం పట్ల ఆసక్తి చూపడంలేదు.