Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వర్సిటి నిరసనలు
- ప్రజాస్వామిక, సామాజిక స్పృహలో ఇతర విద్యాలయాలకు ఆదర్శం
- ఫీజుల పెంపు అణగారిన వర్గాల్ని దూరం చేసే ఎత్తుగడ : విద్యావేత్తలు
జేఎన్యూలో ఉండే రాజకీయ, ప్రజాస్వామిక, సామాజిక వాతావరణం, ఫ్యాకల్టీ బోధనలు విద్యార్థుల ఆలోచనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇక్కడ చదువుకున్న దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఎంతోమంది వివిధ రంగాల్లో ప్రముఖులుగా, పౌర, సామాజికవేత్తలుగా ఎదిగారు. ఆర్థిక నోబెల్ పురస్కారం పొందిన అభిజిత్ బెనర్జీ జేఎన్యూ విద్యార్థే. ఇలాంటి ఈ వర్సిటీ తమకు కొరకరాని కొయ్యిలా తయారైందని కేంద్రంలోని పాలకులు భావిస్తున్నారు. దీంతో ఘర్షణ మొదలైంది. విద్యార్థులు నిరసనబాట పట్టాల్సి వచ్చింది. విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు జరిపినతీరు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
న్యూఢిల్లీ : దేశానికి మేథోపరమైన రాజకీయ కేంద్రంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) నిలబడుతోందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇక్కడ చదివే దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల విద్యార్థుల జీవితాల్ని మార్చటంలో వర్సిటీ పోషించే పాత్ర మాటల్లో చెప్పలేనిది. మనదేశంలోని ఇతర వర్సిటీల్లో కనపడని అరుదైన లక్షణం ఇక్కడ ఉందంటారు. వివిధ సామాజిక వర్గాలతో కూడిన భిన్నత్వం...వర్సిటీ ఖ్యాతిని మరింత పెంచాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో కూడిన ఫ్యాకల్టీ వర్సిటీకి ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఇంత ప్రతిష్ట కలిగిన జేఎన్యూ తమకు పంటికింద రాయిలా మారిందని కేంద్రంలోని ప్రస్తుత పాలకులు భావిస్తున్నారు. పాలకుల విధానాల్లో లోపాల్ని ఎత్తిచూపుతున్న తీరు, విద్యార్థి ఉద్యమాలు మోడీ సర్కార్ను బోనులో నిలబెడుతున్నాయి. దీనిని సహించలేక, సంస్కరణల పేరుతో క్రమంగా వర్సిటీ మౌలిక స్వభావాన్ని మార్చే ప్రయత్నం పాలకులు మొదలుపెట్టారు. వర్సిటీతో బలమైన అనుబంధాన్ని పెంచుకున్న దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థుల్ని దూరం చేయాలన్న ఎత్తుగడను ఎంచుకున్నారు.
మోడీ సర్కార్ ఆలోచన ఇదే..
రాజకీయంగా, సామాజికంగా తెరపైకి వస్తున్న పలు అంశాల్లో దేశంలోని ఇతర వర్సిటీలకు జేఎన్యూ ఆదర్శంగా నిలబడుతోంది. పాలకుల విధానాల్లో లోపాల్ని ఎత్తిచూపటంలో ముందుంటోంది. విద్యార్థి ఉద్యమాలకు కేంద్రంగా నిలబడుతోంది. ఇతర వర్సిటీల్లోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల విద్యార్థుల్లో స్ఫూర్తినింపు తోంది. ఇది మోడీ సర్కార్కు రుచించటం లేదని పలువురు విద్యారంగ విశ్లేషకులు చెబుతున్నారు. అణగారిన వర్గాల విద్యార్థులకు వర్సిటీ ఒక పెద్ద అండగా నిలబడుతోంది.
ఈ బంధాన్ని తెగగొట్టాలనే వ్యూహంలో భాగంగా వర్సిటీ మౌలిక స్వభావానే మార్చే ప్రయత్నం పాలకులు ప్రారంభించారు. మొదటి దశగా హాస్టల్ మెస్, వసతి ఫీజుల పెంపు, ఇతర మార్పులు చేపట్టారని తెలుస్తోంది. సంస్కరణల పేరుతో మోడీ సర్కార్ ఇంతటితో ఆగదనీ, జేఎన్యూ భిన్నమైన లక్షణాన్ని సైతం తుంచివేసే చర్యలు చేపడుతుందని విద్యారంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం తాత్కాలికంగా తప్పుకుంది...
జేఎన్యూలో ఫీజుల పెంపు నిర్ణయంపై సాగిన విద్యార్థుల నిరసనలు ప్రపంచవార్తల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిరసనల ధాటికి మోడీ సర్కార్ తన నిర్ణయాల్ని మార్చుకోక తప్పలేదు. చివరికి విద్యార్థులే విజయాన్ని సాధించారు. అయితే వర్సిటీకి పొంచివున్న ప్రమాదం తాత్కాలికంగా వాయిదా పడిందని మేథావులు, విద్యావేత్తలు అంటున్నారు. మళ్లీ సమయం చూసి, కేంద్రం ఫీజుల పెంపును అమల్లోకి తెస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక వర్సిటీకి సంబంధించిన సమస్య కాదనీ, సామాజిక న్యాయం, విద్య వంటివి దీనితో ముడిపడి ఉన్నాయని వారు చెబుతున్నారు.