Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నాం
- లేకపోతే ఆందోళనకు దిగుతాం
- జమ్మూ వర్సిటీ బయట వందలాది మంది విద్యార్థుల నిరసన
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జమ్మూ యూనివర్సిటీ బయట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటర్నెట్ సేవల నిలుపుదలకు వ్యతిరేకంగా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని.. కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. జమ్మూకాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు రద్దై వంద రోజులకు పైగా అవుతున్నది. దీంతో పరీక్షలకు సన్నద్ధం కావాలన్నా.. ఏవేనీ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవాన్నా.. ఆన్లైన్ కోచింగ్ క్లాసులను వినాలన్నా తమకు చాలా ఇబ్బందిగా మారిందని విద్యార్థులు వాపోయారు. మోడీ సర్కారు మొండి వైఖరిని వారు తప్పుబట్టారు.
ఐదురోజుల్లో సమస్యను పరిష్కరించాలి
వందరోజులు పూర్తయినా ఇప్పటికీ జమ్మూకాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు సస్పెండ్లో ఉండటంపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఆన్లైన్ కోచింగ్ల కోసం బీటెక్ ఎంటెక్ విద్యార్థులు రూ.50 వేల వరకు చెల్లించారు. ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో వారంతా ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు ఐదువేల మందికిపైగా విద్యార్థులు 'నీట్'కు దరఖాస్తు చేసుకోలేకపోయారు. పీహెచ్డీ స్కాలర్స్ తమ థీసెస్ను అందించలేకపోతున్నారు'' అని అహ్మద్ చెప్పారు. ఐదు రోజుల్లోగా జమ్మూకాశ్మీర్లో ఇంటర్నెట్ను పునరుద్ధరించకపోతే 'జన ఆందోళన'కు దిగుతామని కేంద్రాన్ని, యంత్రాంగాన్ని విద్యార్థులు హెచ్చరించారు.
సాధారణ పరిస్థితులే ఉంటే..
ఇంటర్నెట్ ఎందుకు లేదు?
మోడీ సర్కారు తీరుపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్లో కేంద్రం అనుకున్నట్టుగా సాధారణ పరిస్థితులే ఉంటే.. ఇక్కడ ఇంటర్నెట్ ఎందుకు లేదని మోడీ సర్కారును, యంత్రాంగాన్ని ప్రశ్నించారు. మోడీ ప్రవేశపెట్టిన 'డిజిటల్ ఇండియా'లో ఇంటర్నెట్ మాత్రం లేదని విద్యార్థులు అన్నారు.
ఆందోళన చేస్తే దేశ ద్రోహం కేసులు
ఇంటర్నెట్ నిలుపుదలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమపై దేశ ద్రోహం కేసులు మోపుతామని సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ), ఇతర పోలీసు అధికారులు బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. మా హక్కుల కోసం మేము పోరాడితే అది దేశద్రోహం అవుతుందా? అని ప్రశ్నించారు.