Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవాడకు చెందిన మహిళలు వెనక్కి
తిరువనంతపురం : కట్టుదిట్టమైన భద్రత నడుమ కేరళలో శబరిమలలోని అయ్యప్ప ఆలయం శనివారం తెరుచుకుంది. కందరారు మహేశ్ మోహనరారు శనివారం సాయంత్రం ఐదు గంటలకు అయ్యప్ప ఆలయ గర్భగుడి ద్వారాలు తెరిచారు. ఆలయ ద్వారాలు 41 రోజుల (వచ్చే నెల 27వ తేదీ)వరకు తెరిచే ఉంచుతారు. కాగా, అయ్యప్ప దర్శనార్థం కేరళ పొరుగు రాష్ట్రాల నుంచి ఇరుముడితో బయల్దేరిన భక్తులను శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతం నుంచి కొండ ఎక్కేందుకు నిర్వాహకులు అనుమతించారు. ఆలయ అర్చకులు పడిపూజ నిర్వహించిన తర్వాత ఆలయంలోని 18 మెట్లను ఎక్కేందుకు అనుమతిని ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 10వేల మందికిపైగానే పోలీసులను సర్కారు మోహరింపజేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన 10 మంది మహిళలను పోలీసులు వెనక్కి పంపారు. విజయవాడ నుంచి 30 మంది బృందంగా శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి బయల్దేరారు. నిన్న మధ్యాహ్నం పంబా బేస్ క్యాంప్నకు చేరగానే.. ఈ బృందంలోని 10 మంది మహిళలు 10 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్కులని తేలారు. దీంతో పోలీసులు వారిని తిరిగి వెనక్కి పంపించారు. నిషేధిత వయసున్న మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లాలనుకుంటే న్యాయస్థానం ఉత్తర్వులను తీసుకురావాలని కేరళ సర్కారు సూచించిన విషయం తెలిసిందే. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఇటీవలే విస్తృత ధర్మాసనానికి పంపింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాత్రం స్టే ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం మహిళల ఆలయ ప్రవేశం విషయమై అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆలయంలోకి ప్రవేశించాలనుకునే మహిళలు(10 నుంచి 50 ఏండ్ల వయసున్న) కోర్టు ఉత్తర్వులను తెచ్చుకోవాలని పినరయి సర్కారు సూచించింది. అటువంటివారికే రక్షణ కల్పిస్తామని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె సురేంద్రన్ ప్రకటించారు.