Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రార్కి సీపీఐ(ఎం) ఎంపీ కరీం లేఖ
- విద్యార్థుల ఆందోళనలో పాల్గొంటానని వెల్లడి
- హాజరు కావొద్దన్న వర్సిటీ యాజమాన్యం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాలని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు ఎలమరం కరీం విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని కోరారు. వర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన వర్సిటీ రిజిస్ట్రార్కు లేఖ రాశారు. ఇటీవల యూనివర్సిటీ యాజమాన్యం కోర్సుల ఫీజులు పెంచడంతో విద్యార్థులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఆందోళనలో పాల్గొనాలని జేఎన్యూ విద్యార్థి సంఘాలు నేతలు కోరడంతో సోమవారం ధర్నాకు వస్తానని ఆయన, వారికి హామీనిచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ ఎలమరం కరీంకి లేఖ రాశారు. విద్యార్థులు నిర్వహించ తలపెట్టిన ఆందోళనలో పాల్గొనవద్దని లేఖ ద్వారా కరీంను కోరారు. దీనివల్ల అక్కడ శాంతిభద్రత సమస్య తలెత్తుతుందని ప్రస్తావించారు. అయితే, రిజిస్ట్రార్ లేఖకు ఎంపీ కరీం ఘాటుగా స్పందించారు. విద్యార్థుల ఉద్యమానికి యాజమాన్యం స్పందిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. వర్సిటీ యాజమాన్య తీరుతోనే మరింతి ఇబ్బందికరంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సున్నితమైన అంశాలను ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించి పేద విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా వర్సిటీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తే... తాము ధర్నాలో తప్పక పాల్గొంటానని స్పష్టం చేశారు.