Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నేత టీకే రంగరాజన్ వెల్లడి
దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత టీకే రంగరాజన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించడంలో మోడీ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన చెప్పారు. కేంద్రప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీ అనంతరం ప్రతిపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక తిరోగమనం నెలకొందని, దాన్ని నుంచి బయట పడేందుకు మోడీ అవసరమైన చర్యలు చేపట్టలేదని తెలిపారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, చిన్న మధ్య తరగతి పరిశ్రమలు కుదేల వ్వడం, ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్ పరం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఫరూక్ను సభకు అనుమతించాలి : కాంగ్రెస్
గత మూడు నెలలుగా నిర్బంధంలో ఉన్న ఫరూక్ అబ్దుల్లాను, అలాగే జైల్లో ఉన్న చిదంబరాన్ని సమావేశా లకు అనుమతించాలని కాంగ్రెస్ రాజ్యసభ పక్షనేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో కాలుష్యం, ఆర్థిక తిరోగమనంపై లేవనెత్తినట్టు ఆప్ ఎంపీ సంజరు సింగ్ తెలిపారు. ధరలు పెరుగుల, నిరుద్యోగం అంశాన్ని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యా య లేవనెత్తారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: వైసీపీ
ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న తీరును సమావేశం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన నిధుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలని, పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి సవరించిన అంచనా వ్యయానికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. రూ.18,969 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ ఆ మేరకు నిధులు విడుదల చేయాలని, రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.700 కోట్లను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బుదేంల్ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకారం రాష్ట్రానికి దాదాపు రూ.24 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, జనాభా ప్రాతిపదిక బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద ప్రమాణాలు మానుకోవాలని విజయసాయి రెడ్డి చెప్పారు.
గతంలో యూపీఏ ప్రభుత్వం ఎంపీగా ఉన్న జగన్మోహన్రెడ్డిని జైల్లో పెట్టి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మాత్రం చిదంబరానికి అనుమతివ్వాలని కోరుతున్నారని, కాంగ్రెస్ ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదన్నారు.
రాష్ట్ర సమస్యలపై విస్తృత చర్చ జరగాలి: టీడీపీ
పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చ జరగాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కూడా చర్చ జరగాలని కోరామన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని, కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. సభలో పార్టీలకు కేటాయించే సమయాన్ని పెంచాలని కోరామన్నారు. బిల్లుపై చర్చ విషయంలో కూడా రెండు, మూడు నిమిషాలు సమయం కేటాయించడం వల్ల సరైన అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతున్నామని తెలిపారు. లోక్సభ, రాజ్యసభ టీవీలను విలీనం చేస్తారని వార్తలు వచ్చాయని, అది సరైన నిర్ణయం కాదని సమావేశంలో వివరించినట్టు చెప్పారు. విలీనం జరిగితే రెండు సభల్లో జరిగే చర్చలు ప్రజలకు చేరడంలో ఇబ్బందులు వస్తాయన్నారు.
పెండింగ్ అంశాలపై చర్చ అవసరం: టీఆర్ఎస్
రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు పెండింగ్లో ఉన్న అంశాలను సమావేశాల్లో లేవనెత్తుతామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఎన్నో అంశాలపై కేంద్రానికి విజ్ఞప్తులు అందజేసినా స్పందన లేదన్నారు. తాము ఏ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా... చేస్తాం అంటూ పనులను పెండింగ్లో ఉంచుతున్నారని ఆక్షేపించారు. సమావేశాల్లో 27 బిల్లులు ప్రవేశపెడతామని ప్రభుత్వం తరఫున జాబితా ఇచ్చారని నామా వివరించారు. కేవలం బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా దేశంలోని ప్రజాసమస్యలపైనా చర్చ జరగాలని తాము కోరామని నామా తెలిపారు. వారానికి ఒక్కరోజైనా 193వ నిబంధన కింద ప్రజా సమస్యలపై చర్చించాలని కోరినట్లు వెల్లడిం చారు. దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై చర్చ జరగాలని సూచనలు చేసినట్టు వెల్లడించారు.
ఫరూఖ్ అబ్దుల్లాకు అవకాశం కల్పించండి
మూడు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు నేటి నుంచి జరుగబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీలకు చెందిన 27 మంది నాయకులు కేంద్రాన్ని కోరారు. లోక్సభ ఎంపీగా ఉన్న అబ్దుల్లాను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు గులాం నభీ ఆజాద్తో పాటు లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. అలాగే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి సైతం సభలో అవకాశం కల్పించాలని ఆజాద్ కోరారు. దీంతో పాటు కొద్దిరోజులు గా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, రైతాంగ సంక్షోభం పైనా చర్చించాలని నాయకులు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చిస్తామన్న మోడీ సర్కారు.. ఫరూఖ్ అబ్దుల్లాపై ఎటువంటి హామీనీ ఇవ్వలేదు.