Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్సభ ఎన్నికలప్పుడే 65 శాతం ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం : ఏడీఆర్
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల పారదర్శకతపై దేశవ్యాప్తంగా ఓవైపు చర్చ జరుగుతుండగా.. మరోవైపు గతేడాది ముగిసిన లోక్సభ ఎన్నికల కాలంలోనే ఇవి ఎక్కువగా అమ్ముడుపోయా యని ఓ నివేదికలో తేలింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి గతేడాది అక్టోబర్ వరకు రూ.6వేల కోట్లకు పైగా విలువ చేసే బాండ్లు అమ్ముడు పోగా.. 2019 మార్చి, ఏప్రిల్, మేలోనే సుమారు రూ. 4,400 కోట్లు అమ్ముడయ్యాయి. భారత ఎన్నికల వ్యవస్థ తీరుతెన్నులపై విస్తృతస్థాయిలో విశ్లేషణ చేసే అసోసియేషన్ ఫర్ 'డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న అంశాల ప్రకారం.. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి గతేడాది అక్టోబర్ వరకు రూ. 6,128.72 కోట్ల విలువ చేసే 12,313 బాండ్లు అమ్ముడయ్యాయి. ఇందులో 12,173 బాండ్లను (రూ. 6,108 కోట్లు) పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే తిరిగి తీసుకొన్నాయి. కాగా, వీటిలో సాధా రణ ఎన్నికలు జరిగిన మూడు నెలల కాలంలోనే 8,498 బాండ్లను కార్పొ రేట్లు, ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేయడం గమనార్హం. గతేడాది మార్చిలో రూ.1,364.69 కోట్లు (22.34 శాతం) విలువ చేసే బాండ్లు అమ్ముడవగా.. ఏప్రిల్లో రూ. 2,251 కోట్లు (36.86 శాతం), మే లో రూ.819 కోట్లు (13.41 శాతం) బాండ్లు అమ్ముడయ్యాయి. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అత్యధికంగా బాండ్లు అమ్ముడుపోయాయి. ముంబయిలో రూ.1,879.96 కోట్లు (30.67 శాతం), కోల్కతాలో రూ. 1,440.33 కోట్లు (23.5 శాతం), న్యూడిల్లీలో రూ.918.58 కోట్ల (15 శాతం) బాండ్లను పలువురు కొనుగోలుచేశారు. మొత్తంగా అమ్ముడైన బాండ్ల లో 5,624 (45.68 శాతం) ఒక కోటి రూపాయల విలువ కలిగినవి కాగా, 4,877 బాండ్లు (39.61 శాతం) రూ.10 లక్షల విలువ చేసేవని నివేదికలో పేర్కొన్నారు.