Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరువురు నేతల మధ్య క్విడ్ప్రోకో : ఏచూరి
భువనేశ్వర్: భారత్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించే ప్రాంతాల్లో తమ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్లో పర్యటించనున్నట్టు ఇరు దేశాల అధికారిక వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అహ్మదాబాద్, ఢిల్లీల్లో ట్రంప్ పర్యటించనున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పర్యటనపై తమ పార్టీ వైఖరిని ఏచూరి మీడియాకు తెలిపారు. ఢిల్లీ లేదా గుజరాత్లో ట్రంప్ ఎక్కడ పర్యటించినా తమ పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతారని ఏచూరి వెల్లడించారు. సీఏఏ, 370 అధికరణల విషయంలో మద్దతు కావాలంటే తమ కోసం భారత ఆర్థిక వ్యవస్థను తెరిచి ఉంచేలా మోడీ సర్కార్పై అమెరికా ఒత్తిడి చేస్తోందని ఏచూరి అన్నారు. అమెరికా అధ్యక్షుడు, ప్రధాని మోడీకి మధ్య ఇది క్విడ్ ప్రోకో(నీకిది నాకది) ఒప్పందంలాంటిదని ఏచూరి విమర్శించారు. ఇది వ్యాపార, రాజకీయ క్విడ్ప్రోకోగా ఏచూరి అభివర్ణించారు. అమెరికా నుంచి రక్షణ పరికరాలు కొనుగోలు చేయడానికి ఒప్పించే ఉద్దేశంతోనే ట్రంప్ భారత్ పర్యటనకొస్తున్నట్టు ఏచూరి తెలిపారు. అటువంటి ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలాంటిదైతే మన దేశానికి నష్టం చేసేదని ఏచూరి తెలిపారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి మార్గం చూపుతుందని అమెరికా అధికార వర్గాలు ఇప్పటికే వెల్లడించడం గమనార్హం.