Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐడీఆర్ఎఫ్ జాతీయఅధ్యక్షులు కందుల ఆనందరావు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని ఎస్సీ, ఎస్టీల అణచివేతకు మోడీ సర్కారు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నదని ఆలిండియా దళిత్ రైట్స్ ఫోరం జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై మోడీ ప్రభుత్వం కపట వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులకు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని పేర్కొనడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించజాలమని తెలపడం బాధాకరమన్నారు. ఈ చర్యలు రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలోని అధికరణ 16లో పేర్కొన్న నిబంధనలను తుంగలో తొక్కడమేనన్నారు. రిజర్వేషన్లు ఇవ్వడం ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల్లో ఆందోళన నెలకొన్నదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్ల తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా 22న దేశ రాజధానిలో నిరసన సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో దళితవర్గానికి చెందిన సుప్రీంకోర్టు జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ ఈ సమావేశంలో భాగస్వామ్యం అవుతారని అన్నారు. సామాజిక న్యాయాన్ని విస్మరించిన బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి స్పందించాలన్నారు. దళిత, బడుగు, బలహీనవర్గాలను అణచివేసేందుకు కుట్ర జరుగుతున్నదనీ, దేశంలోనే ఉంటూ తాము కూడా భారతీయులమేనని చెప్పుకోవాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారు.