Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేదికను మారిస్తే నిరసన బలహీనం
- షాహీన్బాగ్ నిరసనకారుల వెల్లడి
న్యూఢిల్లీ : తాము చేస్తున్న నిరసన ప్రాంతాన్ని మరొక చోటుకు మారిస్తే పౌర ఆందోళన బలహీనపడే అవకాశమున్నదని షాహీన్బాగ్ నిరసనకారులు అన్నారు. నిరసనల్లో భాగంగా తాము రోడ్డును దిగ్బంధించడానికి ప్రధాన కారణం.. సీఏఏ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకేనని నిరసనకారులు తెలిపారు. నిరసన ప్రదేశాన్ని షాహీన్బాగ్ నుంచి మరొక చోటుకు తరలించేలా నిరసనకారులను ఒప్పించడం కోసం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ షాహీన్బాగ్ నిరసనకారులు తమ స్పందనను తెలియజేశారు. '' కేంద్రంపై ఒత్తిడి పెంచడానికే ఇక్కడ మేము రోడ్డును దిగ్బంధించడానికి ప్రధాన కారణం. కానీ, ఒకవేళ నిరసన వేదికను అసంబంద్ధమైన ప్రదేశానికి తరలిస్తే.. మా డిమాండ్లు ఇంతే స్థాయిలో ఉంటాయో? లేదో? అన్నదానిపై మాకు నమ్మకం లేదు'' అని నిరసనకారుల్లో ఒకరైన నదీం ఖాన్ చెప్పారు. మమ్మల్ని రోడ్డు ఖాళీ చేయాలని ఆదేశించడానికి బదులు.. నిరసనకారులతో మాట్లాడాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాలని అన్నారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి శాంతియుత పద్దతుల్లోనే నిరసకారులు ఆందోళన చేస్తున్నారని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆసిఫ్ ముజ్తాబా తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడుతూ ఆందోళనను అక్కడే కొనసాగించేలా ఒక పరిష్కారం ఉన్నదని చెప్పారు. ''రోడ్డుకు ఒకవైపు ప్రాంతాన్ని ట్రాఫిక్కు విడిచిపెట్టి, మరొకవైపు ప్రదేశంలో నిరసనకారులు తమ ఆందోళనను కొనసాగించొచ్చు'' అని ఆ విద్యార్థి తెలిపారు. నిరసన తెలపడం మా హక్కు అని సుప్రీంకోర్టు గుర్తించడం మాకు ఆనందంగా ఉంది. న్యాయస్థానం నియమించిన మధ్యవర్తిత్వ బృందంతో ఏకాభిప్రాయానికి రావడానికి అవకాశం ఉన్నది. కానీ, ఢిల్లీ పోలీసులు మాత్రం.. షాహీన్బాగ్లోని నిరసనకారులు మహిళలు, చిన్నారులను ఒక రక్షణ కవచంగా వాడుకుంటున్నారని అంటున్నారు'' అని ఆయన చెప్పారు.
ఎన్పీఆర్ అమలు చేయం : ఎంపీ, సీఎం కమల్నాథ్
భోపాల్ : నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)ను మధ్యప్రదేశ్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం కమల్నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్లో కమల్నాథ్ సర్కారు ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఎన్పీఆర్కు సంబంధించి మధ్యప్రదేశ్లో నోటిఫికేషన్ విడుదల అయిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ దానిని వ్యతిరేకించారు. నోటిఫికేషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్పీఆర్ను రాష్ట్రంలో అమలు చేయబోమని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఎన్పీఆర్ను రాష్ట్రంలో అమలు చేయబోమని ఇప్పటికే కేరళ సర్కారు అసెంబ్లీలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాగే పలు బీజేపీయేతర రాష్ట్రాలు కూడా ఎన్పీఆర్ అమలును తిరస్కరిస్తున్నాయి.
జేఎన్యూ విద్యార్థిపై చార్జిషీట్
మార్చి 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ
సీఏఏను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. జేఎన్యూ విద్యార్థి షార్జిల్ ఇమాన్పై హింసను ప్రేరేపించే వ్యక్తిగా పోలీసులు చార్జిషీటు నమోదు చేయడం ఇందుకు నిదర్శనం. తాజా గా ఆయనకు మార్చి 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తు న్నట్టు ఢిల్లీ కోర్టు పేర్కొంది. సీఏఏకు వ్యతి రేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ సమీపం లోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో డిసెంబర్ 15న ఆందోళన చేపట్టిన షార్జిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతనిపై దేశద్రోహం కేసును నమోదు చేశారు.