Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్-19 చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్తో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై ప్రతిపక్ష పార్టీలు మోడీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇది ముందస్తు సన్నద్దత లేకుండా చేసిన చర్య అని అభిప్రాయపడుతున్నాయి. శనివారం ఆనంద్విహార్లో జరిగిన ఘటనపై కాంగ్రెస్, సీపీఐ(ఎం)తో పాటు పలువురు ఇతర పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రణాళిక లేకుండా నిర్ణయాలు ప్రకటించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు.
ఇదే విషయమై సీపీఐ(ఎం) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి స్పందిస్తూ... 'కేంద్రం అమలుచేస్తున్న విధానాలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నాయి. రక్షిత ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు సకాలంలో తీసుకోలేదు. ఇప్పటికీ కేంద్రం దాని మీద దృష్టి పెట్టడం లేదు. అంతేగాక రాష్ట్రాల డిమాండ్లను పట్టించుకోకుండా వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతున్నది' అని ట్వీట్ చేశారు. ఓవైపు సొంతిండ్లకు వెళ్లలేక వలస కార్మికులు నానా ఇబ్బందులు పడుతుంటే కేంద్ర మంత్రులు మాత్రం టీవీల్లో రామాయణం చూస్తూ (కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్లో తాను రామాయణం చూస్తున్నానని ట్వీట్ చేశారు) కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకోబడిన నాయకులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో కేరళ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిని చూసి నేర్చుకోవాలని హితువు పలికారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆనంద్విహార్లో ప్రజలు గుమిగూడి ఉన్న దృశ్యాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ.. 'ఈ సంక్షోభ సమయంలో మన సోదర, సోదరీమణులకు మనం మద్దతుగా నిలుద్దాం. ఇది మరో విషాధంగా మారకముందే ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి' అని పేర్కొన్నారు.