Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భారత్లో భగ్గుమంటున్న పెట్రో, డీజిల్ రేట్లు
న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు చల్లబడుతుంటే.. భారత్లో మాత్రం భగ్గుమంటున్నాయి. విదేశాల్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో ఏకంగా 18 ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. కానీ భారత్లో మాత్రం రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరావడం లేదు. సోమవారం అమెరికా మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 20 డాలర్లకు పడిపోయింది. ఇది 2002 నవంబర్ నాటి కనిష్ట స్థాయి. లాక్డౌన్ దెబ్బకు డిమాండ్ లేకపోవడంతో ధరలు క్షీణిస్తున్నాయి. భారత్లో వరుసగా 14వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంతక్రితం మార్చి 16న మోడీ సర్కార్ చమురు ధరలను సమీక్షించి..ఎక్సైజ్ సుంకాన్ని మూడు రూపాయలకు పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ధరలు దిగివస్తున్నా.. భారత్లో మాత్రం ధరలు యథాతథంగా కొనసాగించడం గమనార్హం.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59గా, ముంబయిలో రూ.75.30గా ఉంది. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.62.29గా, ఆర్థిక రాజధాని ముంబయిలో రూ.65.21గా విక్రయిస్తున్నారు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97, విజయవాడలో రూ.74.32గా ఉన్నది. ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.39,000 కోట్లు వస్తాయని అంచనా వేసింది. అంటే ఈ మొత్తం ప్రజలపై భారం పడనున్నది. అదే విధంగా భవిష్యత్తులో ఎక్సైజ్ డ్యూటీ రూ.8 వరకు పెంచుకునేలా ఇటీవలే మోడీ సర్కార్ పార్లమెంట్లో ఆమోదం తెలిపింది.
మార్చి 14 తర్వాత స్థూలంగా పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.22.98గా, డీజిల్పై రూ.18.83గా అమల్లో ఉంది. మోడీ సర్కార్ 2014లో తొలత అధికారం చేపట్టిన సమయంలో పెట్రోల్పై రూ.9.48గా, డీజిల్పై రూ.3.56గా పన్ను అమల్లో ఉంది. బీజేపీ ప్రభుత్వం 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య పెట్రోల్, డీజిల్పై తొమ్మిది సార్లు ఎక్సైజ్ పన్ను భారాన్ని జనం నెత్తిన మోపింది. మరోవైపు ఈ కాలంలో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. ఆ 15 మాసాల కాలంలో లీటర్ పెట్రోల్పై రూ.11.76, డీజిల్పై రూ.13.47 చొప్పున ఎక్సైజ్ పన్నును పెంచింది. అదే సమయంలో దాదాపుగా పన్ను బాదుడును రెట్టింపు చేసింది. 2014-15లో ప్రజలపై ఈ పన్ను భారం రూ.99,000 కోట్లుగా ఉండగా.. 2016-17 నాటికి ఏకంగా రూ.2,42,000 కోట్లకు చేర్చింది. 2017లో అక్టోబర్లో ఎక్సైజ్ టాక్స్లో రూ.2 తగ్గించింది. మళ్లీ ఏడాదికే దీన్ని రూ.1.50 పెంచింది. 2019 జులైలో మరో రూ.2 పెంచేసింది. సౌదీ అరేబియా చమురు యుద్ధానికి తోడు కరోనా వైరస్ నేపథ్యంలో చమురు ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు అమాంతంగా క్షీణిస్తున్నాయి. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 100 మిలియన్ బ్యారెల్స్ చమురు వినియోగం ఉంటుంది. గత కొన్ని వారాలుగా ఇందులో వినియోగం పావు వంతుకు పడిపోయింది. అంతర్జాతీయంగా భారీగా తగ్గుతున్న చమురు ధరలను భారత్లో మోడీ సర్కార్ వినియోగదారులకు చేర్చకుండా.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలపై భారాన్ని మోపడం అన్యాయమని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక పన్నులు, ధరల వల్ల ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోయి.. దేశ ఆర్ధిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని వారు హెచ్చరిస్తున్నారు