Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలాల్లో డంబళ గ్రామస్తుల నివాసం
- టన్నులకొద్దీ ద్రాక్ష, టమాట రోడ్డుపాలు
బెంగళూరు: వలస కార్మికులంతా ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ఊర్లోకి రావడంతో కర్నాటకలోని డంబళ గ్రామస్తులు కొందరు ఇండ్లను వదిలి పొలాల్లో ఉంటున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గిట్టుబాటు ధర రాక టన్నుల కొద్దీ ద్రాక్ష తదితర పంటలను రైతులు రోడ్డుపాలు చేశారు. మైసూరు జిల్లా నంజనగూడు పట్టణంలో సోమవారం ఐదుగురు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, ఆ నగరాన్ని పూర్తిగా దిగ్బంధించారు. నంజనగూడు సమీపంలోని కల్లహళ్లి పారిశ్రామికవాడలో 50మందిని క్వారంటైన్ క్యాంపులకు తరలించారు. ఒకేరోజు మైసూరులో కరోనా బాధితుల సంఖ్య 12కు పెరిగింది. రాష్ట్రంలో కరోన బాధితులు సంఖ్య 88కు పెరిగింది. లాక్డౌన్ వల్ల శివమొగ్గ జిల్లాలో పాలసేకరణను పూర్తిగా నిలిపివేసినట్టు నందిని కెఎంఎఫ్ యాజమాన్యం ప్రకటించింది. గిట్టుబాటు ధర రాకపోవడంతో మైసూరు ఏపీఎంసీ యార్డులో టమాటా రైతులు, మండ్య పట్టణంలో సపోటా రైతులు, చిక్కబళ్లాపురలో టన్నుల కొద్దీ ద్రాక్ష పంటను పెంట కుప్పలపై పారబోసి నిరసన తెలిపారు. యాదగిరిజిల్లాలో రైతు వెంకటేశప్ప ఎనిమిది ఎకరాల్లో పండించిన కర్బూజ పండ్లను పొలంలోనే పశువుల మేతకు వదిలేశారు. గదగజిల్లా డంబళలో సుమారు 50 కుటుంబాలు ఇండ్లను వదిలిపెట్టి పొలాల్లో గుడిసెలు వేసి వంటావార్పు చేసుకున్నారు. ఇటీవల బెంగళూరు, మంగళూరు, గోవా నుంచి వలస కార్మికులు ఎలాంటి వైద్యపరీక్షలు చేయించుకోకుండా గ్రామంలోకి వచ్చేసరికి గ్రామస్తులు ఊరిబయట పొలాల్లోకి వెళ్లి గుడిసెల్లో ఉంటున్నారు.