Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందువు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు
బులంద్షహర్ : మానవత్వం పరిమళించింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షెహర్లో అరుదైన ఘటన వెలుగుచూసింది. ఓ పక్క కరోనా మహమ్మారి భయాందోళనలు.. మరోపక్క లాక్డౌన్.. నేపథ్యంలో చనిపోయిన హిందువు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం అందలేదు. నిరుపేద కుటుంబం అవస్థను చూసిన చుట్టుపక్కల ముస్లింలు ముందుకొచ్చి... అంత్యక్రియలు నిర్వహించారు. మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. బులంద్షెహర్లోని మౌలానా ఆనంద్ విహార్లో రవిశంకర్ క్యాన్సర్ వ్యాధితో ఆదివారం మరణించారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు. అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులూ రాలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం సోదరులు రవిశంకర్కు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని తరలించే సమయంలో 'రామ్ నామ్ సత్య హై' అంటూ వారు నినాదాలు చేయటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. లాక్డౌన్ నేపథ్యంలో బంధువులెవరూ రాలేకపోయారని రవిశంకర్ కుమారుడు చెప్పారు. ముస్లిం సోదరులే కార్యక్రమం మొత్తం నిర్వహించారన్నారు. తనకు ఎదురైన కష్టకాలంలో తమకు అండగా నిలిచారన్నారు. ప్రస్తుత రోజుల్లో ఇది చాలా అరుదుగా కనిపించే ఘటనంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్టు పోస్టుచేశారు.